జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు-బ్యాంకులపైనా -గవర్నర్ మౌనం వెనుక-పయ్యావుల కార్నర్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్డీసీ సాయంతో చేస్తున్న రుణాల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన పయ్యావుల కేశవ్.. ఇప్పుడు కేంద్రం దీనికి స్పందించి లేఖ రాయడంతో ఇవాళ మరిన్ని డిమాండ్లు చేశారు. జగన్ సర్కార్ ఏపీఎస్డీసీ ద్వారా తెస్తున్న రుణాలపై కాగ్ దర్యాప్తు జరిపించడంతో పాటు ఆ రుణాలు ఇస్తున్న బ్యాంకులపైనా అత్యున్నత స్ధాయి దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ, బీజేపీ మధ్య స్నేహం కారణంగానే జగన్ సర్కార్ ఆర్ధిక అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదని పయ్యావుల ఆరోపించారు.
కేంద్రం లేఖతో టీడీపీలో జోష్
ఏపీఎస్డీసీ పేరుతో జగన్ సర్కార్ భారీ స్ధాయిలో తీసుకుంటున్న రుణాలపై కేంద్ర ఆర్ధికశాఖ తాజాగా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందులో రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటైన ఏపీఎస్డీసీ ద్వారా భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అసలు ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ఎస్డీసీ విషయంలో గతంలో తాను చేసిన ఆరోపణల్ని కేంద్రం సమర్ధించిందని పయ్యావుల ఇవాళ వెల్లడించారు. దీనిపై మరింత లోతైన దర్యాప్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
తేలింది గోరంతే.. ఇంకా చాలా ఉంది
ఏపీఎస్డీసీ రుణాలపై కేంద్రం స్పందించి ఏపీ సర్కార్ కు లేఖ రాయడాన్ని స్వాగతించిన పీఏసీ ఛైర్మన్ పయ్వావుల కేశవ్.. ఇది కేవలం గోరంతేనని, ఇంకా తేలాల్సింది కొండంత ఉందన్నారు. దీనిపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎదురుదాడి చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు కేంద్రం లేఖకు ఏం సమాధానం చెబుతుందని పయ్యావుల ప్రశ్నించారు. ప్రభుత్వాలు శాశ్వతమని అందులో వ్యక్తులు శాశ్వతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పై తమకెలాంటి కోపం లేదని, వ్యవస్ధలు కుప్పకూలకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమన్నారు.
జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు
జగన్ సర్కార్ ఏపీఎస్డీసీ ద్వారా రాజ్యాంగ విరుద్ధంగా, కేంద్రానికి తెలియకుండా చేస్తున్న అప్పులపై కాగ్ దర్యాప్తు జరిపిస్తేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల తెలిపారు. కేంద్రం వెంటనే వీటిపై కాగ్ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో జగన్ సర్కార్ కు చట్ట విరుద్ధంగా రుణాలు మంజూరు చేస్తున్న బ్యాంకులపైనా అత్యున్నత స్ధాయి దర్యాప్తు చేయించాలని పయ్యావుల కేంద్రాన్ని కోరారు. అప్పుడే ఈ రుణాల వ్యవహారం, పెట్టిన హామీలు, ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు.
గవర్నర్ మౌనమెందుకో ?
ఏపీఎస్డీసీకి రుణాల వ్యవహారంలో గవర్నర్ పాత్రను కూడా పీఏసీ ఛైర్మన్ పయ్యావుల ప్రశ్నించారు. గవర్నర్ కార్యాలయాన్ని కూడా ప్రశ్నిస్తున్నా, మీకు తిప్పి పంపే అధికారం ఉంది, అయినా ఈ రుణాల వ్యవహారాన్ని ఎందుకు గుడ్డిగా ఆమోదించారని పయ్యావుల ప్రశ్నించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పేనని, ఇందులో బాధ్యులైన అధికారులపై ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని పయ్యావుల నిలదీశారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల బ్యాంకులు కూడా ఇరుకున పడ్డాయని పయ్యావుల పేర్కొన్నారు. అసెంబ్లీలో పెట్టకూడని అంశాలు పెట్టి ఆమోదిస్తుంటే గవర్నర్ ఏం చేశారని పయ్వావుల ప్రశ్నించారు.
వైసీపీపై బీజేపీ ప్రేమ ఎందుకో ?
ఏపీ ప్రభుత్వం రుణాల పేరుతో ఆర్ధిక అక్రమాలకు తెరదీస్తున్న విపక్ష బీజేపీ మాత్రం కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు జంకుతోందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల ఆరోపించారు. పైకి కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నట్లు నటిస్తూ వాస్తవంలో మాత్రం మౌనంగా ఉండిపోతోందన్నారు. దీంతో ఎవరిపై ఎవరికి ప్రేమ ఉందో అర్ధం కావడం లేదన్నారు. కేంద్రం నుంచి ఏపీ సర్కార్ కు అందిన నోటీసులు కూడా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదు ఆధారంగానే కావడంతో బీజేపీని, వైసీపీని పయ్యావుల కార్నర్ చేసినట్లు తెలుస్తోంది.