సోషల్ పోస్టులపై మళ్లీ వైసీపీ సర్కార్ కొరడా-సీబీఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ అరెస్ట్
ఏపీలో గతేడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. ప్రభుత్వ నిర్ణయాల్ని, విధానాల్ని విమర్శిస్తూ పెట్టిన ఆయా పోస్టులపై సీఐడీ విచారణ జరిపింది. ఆ తర్వాత వీటి దర్యాప్తు మూలనపడింది. తాజాగా మరోసారి ఏపీ పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై కొరడా ఝళిపిస్తున్నారు.
టీడీపీ సోషల్ మీడియా విభాగాల్లో ఒకటైన సీబీఎన్ ఆర్మీకి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న మద్దినేని వెంకట మహేష్ను గుంటూరు పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పోస్టులు పెట్టిన వ్యవహారంలో గుంటూరు అరండల్ పేట పోలీసులు ఈయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిత్యం విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కొంతకాలంగా పోలీసు ఐటీ విభాగం నిఘా పెట్టింది.

వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మహిళలు కూడా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై ఇప్పటికే పలువురిపై సీఐడీ కేసులు నమోదు చేయగా.. పోలీసులు కూడా విడిగా కేసులు పెట్టారు. ఇప్పుడు తాజాగా సీబీఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ను గుంటూరు పోలీసులు అరెస్టు చేయడంపై టీడీపీ భగ్గుమంటోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిందని టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు.












Click it and Unblock the Notifications