ఏపీలో 20 శాతం మందికి కరోనా వచ్చిపోయింది- సీరో సర్వైలెన్స్ సర్వేలో వెల్లడి...
ఏపీలో కరోనా వ్యాప్తి తర్వాత ప్రభుత్వం భారీగా పరీక్షలు నిర్వహిస్తోంది. వీటి ఆధారంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. అయితే కరోనా కట్టడి విషయంలో ఎంత శ్రమిస్తున్నా జనంలో చాలా మందికి కరోనా వచ్చినట్లు తెలియకుండానే వచ్చిపోతున్నట్లు గుర్తించింది. ఇందుకోసం నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వే ఫలితాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. వీటిలో రాష్ట్రంలో దాదాపు 20 శాతం మందికి తమకు తెలియకుండానే కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ అయింది. ఆగస్టులో రెండు దపాలుగా నిర్వహించిన ఈ సర్వేలో ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
సీరో సర్వైలెన్స్ ఫలితాల వెల్లడి..
ఏపీలో కరోనా వైరస్ సోకిన వారితో పాటు జనానికి తెలియకుండానే ప్రభావం పడుతున్న నేపథ్యంలో దీన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం తాజాగా సీరో సర్వైలెన్స్ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో తెలియకుండానే ఎవరికి కరోనా వచ్చి తగ్గిపోయిందన్న అంశాన్ని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో కరోనా లక్షణాలు అస్సలు కనిపించని వారితో పాటు ఒకటీ అరా లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్ తీసుకుని పరీక్షించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో రెండు దఫాలుగా ఈ సర్వే నిర్వహించారు. ముందుగా తూర్పుగోదావరి, అనంతపురం, నెల్లూరు, కృష్ణా జిల్లాలో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకూ నిర్వహించారు. ఆ తర్వాత ఆగస్టు 26 నుంచి 31 వరకూ మిగిలిన 9 జిల్లాల్లో సర్వే జరిగింది. వీటి ఫలితాలను ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది.
20 శాతం మందికి కరోనా వచ్చిపోయిందట..
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రెండు దపాలుగా జరిగిన సీరో సర్వేలో తొలి దఫాలో జిల్లాకు 3500 శాంపిల్స్ చొప్పున, రెండో దఫాలో జిల్లాకు 5 వేల శాంపిల్స్ చొప్పున సేకరించి పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా సోకిన వారు కాకుండా మరో 20 శాతం మందికి కరోనా తెలియకుండానే వచ్చి తగ్గిపోయినట్లు ప్రభుత్వం నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వేలో తేలింది. కచ్చితంగా చెప్పాలంటే 19.7 శాతం మందికి ఇలా కరోనా వచ్చిపోయిందని సర్వే చెబుతోంది. పురుషుల్లో 19.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ కాగా.. మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు తెలుస్తోంది. పట్టణాల్లో 22.5 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్లు సర్వేలో నిర్ధారణ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో 18.2 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు వెల్లడైంది.
20 శాతానికి పైగా హై రిస్క్లో...
సీరో సర్వే ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో 20.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ అయింది. అలాగే నాన్ కంటైన్మెంట్ జోన్లలో 19.3 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు వెల్లడైంది. మరోవైపు ఇలా రాష్ట్రంలో తమకు తెలియకుండానే కరోనా వచ్చిపోయిన వారిలో 20.3 శాతం మంది హైరిస్క్లో ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంటే వీరిలో కరోనా లక్షణాలు కనిపించకపోయినా వీరు హై రిస్క్లోనే ఉన్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వం వీరిని ప్రత్యేక కేటగిరీ కింద చికిత్స అందించాల్సి ఉంటుంది. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో కరోనా వాస్తవ పరిస్ధితి తెలుసుకోవడంతో పాటు అందుకు తగినట్లుగా సౌకర్యాల కల్పన కోసం ఈ ఫలితాలు ఉపయోపడతాయని ప్రభుత్వం చెబుతోంది.