AP weather: బలపడిన అల్పపీడనం తుఫాను, ఏపీకి భారీ వర్షాలు, పోర్టులకు అలర్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ పంట నష్టం జరిగింది. అనేక మంది ప్రజలు వారి నివాసాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తోడు మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది.

తుఫానుగా వాయుగుండం..
అండమాన్ సముంద్రం ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో వాయుగుండం.. తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కోస్తా, సీమలో వర్షాలు, పోర్టులకు అలర్ట్
ఈ తుఫాను పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ డిసెంబర్ 4వ తేదీ నాటికి కోస్తాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. దీని ప్రభావం డిసెంబర్ 3 నుంచి ఉత్తరకోస్తాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర తీరప్రాంతంలోని మత్స్యకారులు రాగల రెండు రోజులు చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు చేశారు. పోర్టులకు కూడా అప్రమత్తత హెచ్చరికలు జారీ అయ్యాయి. పంటలు కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఉభయగోదావరి, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన రైతులకు సూచించారు.
Recommended Video

ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో బుధవారం వాతావరణం పొడిగా ఉంటుంది. గురువారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. బుధవారం నుంచి రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. గురు, శుక్రవారాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా, గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తమవంతుగా విరాళాలు అందజేస్తున్నారు. చిరంజీవి, మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, తదితర నటులు విరాళాలు అందజేశారు.












Click it and Unblock the Notifications