APSRTC: వారికి టికెట్పై ఏకంగా 25 శాతం డిస్కౌంట్- అన్ని బస్సుల్లోనూ వర్తింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త గమ్యస్థానాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతూ ప్రత్యేక ప్యాకేజీ ట్రిప్పులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం అనేక పర్యాటక కేంద్రాలకు బస్సులను ప్రవేశపెడుతోంది. మంచి ఆదరణ లభిస్తోండటంతో మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.
పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకూ సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బస్ సర్వీసులను ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఊటీ, గోవా, పుదుచ్చేరికి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీకెండ్ సర్వీస్ పేరుతో ప్రతి శనివారం నెల్లూరు నుంచి పుదుచ్చేరి మధ్య ప్రవేశపెట్టిన బస్సుకు మంచి డిమాండ్ లభిస్తోంది.

ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో స్టార్ లైనర్, నైట్ రైడర్, ఇంద్ర, డాల్ఫిన్ బస్ సర్వీసుల సంఖ్యను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఆయా బస్ సర్వీసులన్నింటికీ మంచి డిమాండ్ ఉంటోంది. ప్రయాణికుల నుంచి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఆయా బస్ సర్వీసుల సంఖ్యను పెంచుతోంది.
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప.. వంటి జిల్లా కేంద్రాల నుంచే కాకుండా ఇతర పట్టణాల నుంచీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు స్టార్ లైనర్, నైట్ రైడర్ బస్సులను ప్రవేశపెట్టింది. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది ఏపీఎస్ఆర్టీసీ.
ఇదివరకు టికెట్ల కొనుగోలుపై 10 శాతం రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాను పోను టిక్కెట్లు ఒక్కసారే బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. తాము ఎక్కదలిచిన బస్ స్టేషన్ నుంచి గమ్యస్థానానికి, గమ్యస్థానం నుంచి మళ్లీ తమ సొంత స్థలాలకు ఒకేసారి రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ 10 శాతం రాయితీ ఇస్తోంది.
రానుపోను టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఇన్స్టంట్గా 10 శాతం డిస్కౌంట్ను పొందవచ్చు. ఇప్పుడు ఆర్టీసీ మరో అడుగు ముందుకేసింది. 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు తీపి కబురు వినిపించింది. సీనియర్ సిటిజన్లకు ప్రయాణంలో ఏకంగా 25 శాతం డిస్కౌంట్ను ప్రకటించింది.
అన్ని రకాల బస్సుల్లోనూ ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. పల్లె వెలుగు మొదలుకుని ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఇంద్ర, నైట్ రైడర్, ఏసీ- స్లీపర్, నాన్ ఏసీ- స్లీపర్ బస్సుల్లో కూడా టికెట్పై 25 శాతం రాయితీ లభిస్తుంది. ప్రయాణికులకు సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications