ఆర్టీసీ ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం - ఇక కొత్తగా..!!
ఏపీఎస్ఆర్టీసీ లో కీలక నిర్ణయాల అమలుకు రంగం సిద్దమైంది. కూటమి ప్రభుత్వం తమ హామీ అయిన మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన కసరత్తు చేస్తోంది. దీనికి ముందే ఆర్టీసీ లో కొత్త బస్సులు.. నియామకాల పైన అధికారులు నివేదిక ఇచ్చారు. అటు మంత్రుల కమిటీ ఇదే అంశం పైన ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తోంది. ఈ సమయంలోనే ఆర్టీసీ వెయ్యికి పైగా ఎలక్ట్రి కల్ బస్సులను ప్రవేశపెట్టేలా రూట్ మ్యాప్ ఖరారు చేసింది. దీంతో, ఛార్జీలు తగ్గే ఛాన్స్ ఉంది.
ఆర్టీసీ తాజా నిర్ణయం
ఏపీఎస్ ఆర్టీసీలో కొత్తగా వెయ్యికి పైగా ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం తాజాగా ఈ బస్సులకు ప్రోత్సాహం అందిస్తోంది. దీనిని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఈ బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా 1050 బస్సులు ప్రవేశ పెట్టేందుకు టెండర్లు పిలిచారు. వీటిని త్వరలో ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం తిరుపతి లో మాత్రమే విద్యుత్ బస్సులు నిర్వహిస్తున్నారు. అధికారుల తాజా ప్రతిపాదనల మేరకు ఇక నుంచి అమరావతి, విజయవాడ, గుంటూరు సహా పలు ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ బస్సుల ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటుగా ఛార్జీలు తక్కువే.

రాష్ట్ర వ్యాప్తంగా
రానున్న అయిదేళ్లు కాలంలో రాష్ట్రంలోని అన్ని డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 'పీఎం ఈ-బస్ సేవ' పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీలో 1050 విద్యుత్ బస్సులను కేటాయిస్తోంది. ఇందు కోసం డిసెంబర్ 10 న టెండర్లు పిలవగా పలు సంస్థలు బిడ్లు దాఖలు చేశారు. త్వరలోనే ప్రభుత్వం వీటి పైన నిర్ణయం తీసుకో నుంది. బస్సుల ఎంపికతో పాటుగా ఛార్జీల ఖరారు చేయనున్నారు. కేంద్రం ఒక్కో బస్సుకు రూ 35 లక్షల మేర సబ్సిడీ ఇస్తోంది. దశల వారీగా ఏపీకి ఈ బస్సులు అందనున్నాయి. వీటిని ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన నడపనుంది. తొలుత ఏపీలో 11 నగరాలకు 750 విద్యుత్ బస్సులు అద్దె ప్రాతిపదికన మంజూరు అయ్యాయి.
ప్రాధాన్యత క్రమంలో
ప్రస్తుతం తిరుమల - తిరుపతి మధ్య 50 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా భక్తులకు మరిన్ని విద్యుత్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నం సిటీ -100, విజయవాడ సిటీ -100 , గుంటూరు సిటీ-100 , నెల్లూరు సిటీకి -100 బస్సులు చొప్పున కేటాయించ నున్నారు. ఆయా నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరుగుతుండటం, బస్సులులేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతోన్న దృష్ట్యా బస్సుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. రాజధాని అమరావతికే 50 విద్యుత్ బస్సులు కేటాయించారు. కర్నూలు -50 , కడప -50 , అనంత పురం-50 , కాకినాడ-50 , రాజమహేంద్రవరం- 50 బస్సులు చొప్పున మంజూరు చేశారు. దీంతో, రానున్న రోజుల్లో రాష్ట్రంలో డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు వినియోగం లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసారు.












Click it and Unblock the Notifications