నువ్వే వెళ్లిపో: జెసిVsబొత్స వాగ్వాదం, జగన్కి సవాల్
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో రాజ్యసభ గందరగోళానికి దారి తీస్తోంది. ఈ విషయమై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డిల మధ్య మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని బొత్స చెబుతుండగా, సమైక్యాంధ్ర కోసమంటూ జెసి వర్గం చైతన్య రాజును రాజ్యసభ బరిలోకి దింపింది. దీనిపై వారి మధ్య వాగ్వాదం జరిగింది.
జెసి, బొత్సలు లాబీల్లో ఎదురు పడ్డారు. ఈ సమయంలో బొత్స.. ధైర్యముంటే పార్టీ నుండి వెళ్లిపోవాలని జెసిని ఉద్దేశించి అన్నారు. దానికి జెసి ఘాటుగానే స్పందించారు. నేను ఎందుకు వెళ్తాను నువ్వే వెళ్లు అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలతో లాలూచీ పడ్డావని బొత్సపై నిప్పులు చెరిగారు. దానికి తనకు ఆ అవసరం లేదని, ఎవరితోను లాలూచి పడనని, తాను పార్టీలో ఉంటూ నష్టం చేయడం లేదని బొత్స ఆగ్రహంతో అక్కడి నుండి వెళ్లిపోయారు.
రాజ్యసభకు ఎనిమిది మంది నామినేషన్
రాజ్యసభకు ఎనిమిది మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెసు పార్టీ నుండి ముగ్గురు, తెలుగుదేశం పార్టీ నుండి ఇద్దరు, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఒక్కరు, స్వతంత్రులుగా చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డిలు వేశారు. కాంగ్రెసు నుండి వేసిన వారిలో కెవిపి రామచంద్ర రావు, ఎంఏ ఖాన్, టి సుబ్బిరామి రెడ్డి, టిడిపి నుండి గరికపాటి, సీతారామలక్ష్మి, తెరాస నుండి కె కేశవ రావులు వేశారు. నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపేందుకు పిసిసి యోచిస్తోంది. అధిష్టానాన్ని అడిగింది. అనుమతి కోసం నిరీక్షిస్తోంది.
బుజ్జగింపులు
మరోవైపు చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతు పలుకుతున్న మంత్రులు, శాసన సభ్యులను బుజ్జగిస్తున్నారు. కొందరు ఇప్పటికే వెనక్కి తగ్గారు. కొడుమూరు ఎమ్మెల్యే చైతన్య రాజుకు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయన మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, అంతకుముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను సమైక్యవాదిగా బరిలోకి దిగుతానన్నానని, వైయస్ జగన్ నిజమైన సమైక్యవాది అయితే తనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయాలని సవాల్ చేశారు.