ఆళ్లగడ్డలో భగ్గుమన్న పాతకక్షలు.. అఖిలప్రియ బాడీగార్డుపై దాడి; పరిస్థితి విషమం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగడం లేదు. తాజాగా ఆళ్లగడ్డలో పాత కక్షలు మళ్ళీ భగ్గుమన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నివురు గప్పిన నిప్పులా ఉన్న పాతకక్షలు పోలింగ్ సందర్భంగా మళ్లీ పురుడు పోసుకున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఆళ్లగడ్డలో తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన అఖిల ప్రియ బాడీగార్డ్ పరిస్థితి విషమంగా ఉంది.
ఆళ్లగడ్డలో టీడీపీ వర్గపోరు
ఏపీలో పోలింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగింది. తెలుగుదేశం, వైసిపి వర్గీయులు బాహాబాహీ కి దిగి ఆస్తులు ధ్వంసం చేసుకోవడంతో పాటు, రక్తపుటేరులు పారిస్తున్నారు. అయితే ఏపీలోని ఆళ్లగడ్డలో మాత్రం అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకే పార్టీలో ఉంటూ ఉప్పు, నిప్పుగా మారిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, తెలుగుదేశం నేత ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య దాడులు మొదలయ్యాయి.

చావుబతుకుల మధ్య భూమా అఖిలప్రియ బాడీ గార్డ్
అధినేత చంద్రబాబుకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు సంయమనం పాటించిన ఇరువర్గాలు ఓటింగ్ ముగిసిన వెంటనే కయ్యానికి కాలు దువ్వారు. ఈ క్రమంలోనే భూమా అఖిలప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం జరిగింది. భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ నిఖిల్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ఈ దాడి వెనుక ఏ.వి సుబ్బారెడ్డి హస్తం ఉందని భూమా అఖిలప్రియ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
లోకేష్ పాదయాత్ర సమయంలో ఏ.వీ సుబ్బారెడ్డిపై దాడి ఘటన
లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా స్వాగత ఏర్పాట్లు చేసే క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అఖిలప్రియ వర్గీయులు ఏ.వీ సుబ్బారెడ్డి పై దాడి చేశారు. భూమా అఖిలప్రియ బాడీగార్డ్ గా ఉన్న నిఖిల్ కూడా ఏవి సుబ్బారెడ్డి పై దాడికి పాల్పడ్డాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవి సుబ్బారెడ్డి నోటి నుండి రక్తం కూడా వచ్చింది. ఆ సమయంలో భూమా అఖిలప్రియ ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించారు.
ఎన్నికలు ముగిసే దాకా సైలెంట్ .. ఎందుకంటె
అయితే ఈ వ్యవహారంపై సీరియస్ అయిన చంద్రబాబు ఇరు వర్గాలను పిలిచి తీవ్రంగా మందలించారు. ఎన్నికలు ముగిసే వరకు ఇరు వర్గాలు సంయమనంతో పని చేయాలని, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. దీంతో ఎన్నికలు ముగిసే వరకు సైలెంట్ గా ఉన్న ఇరువర్గాలు ఇప్పుడు దాడులకు తెగబడ్డాయి.
ఏ.వీ సుబ్బారెడ్డిపై దాడి.. రివెంజ్ తీర్చుకున్న ఏ.వీ
ఇందులో భాగంగా సుబ్బారెడ్డి పై దాడి చేసిన నిఖిల్ పై దాడి చేయించినట్టు భూమా వర్గం ఆరోపిస్తుంది. నిఖిల్ చేతిలో దెబ్బ తిన్న కక్షలో భాగంగా ఏ. వీ సుబ్బారెడ్డి దాడి చేయించారని అంటున్నారు. ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పాత కక్షలే ఇందుకు కారణమని స్థానికంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications