జూ ఎన్టీఆర్పై బాలకృష్ణ రుసరుస, నారా రోహిత్ ప్రచారం
విజయనగరం/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మౌనంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పైన తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో స్పందించారు. బుధవారం బాలకృష్ణ విజయనగరంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్కు టిడిపి అవసరం లేదేమోనని వ్యాఖ్యానించారు.
పార్టీ తరఫున ప్రచారం చేయాలని తాము ఎవరినీ పిలవలేదన్నారు. ఎవరి పైన ఒత్తిడి తీసుకురామన్నారు. పార్టీ పైన అభిమానం ఉంటే వారే వచ్చి ప్రచారం చేస్తారన్నారు. తాను తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నియోజకవర్గం రాజంపేటలో ప్రచారం చేయడం లేదని చెప్పారు. తన సోదరుడు హరికృష్ణను కూడా ప్రచారం చేయమని అడగలేదన్నారు. హిందూపురం నుండి తాను భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పారు.
నారా రోహిత్ ప్రచారం
చంద్రబాబు సోదరుడి కుమారుడు, హీరో నారా రోహిత్ టిడిపి తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ నెల 25న గుంటూరు, విజయవాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో, 26న విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో, 27న అనంతపురం, తిరుపతిలలో ఆయన ప్రచారం చేయనున్నారు.
మా ప్రభుత్వాలే: చంద్రబాబు
రెండు రాష్ట్రాల్లో టిడిపి, బిజెపి ప్రభుత్వాలే ఏర్పడతాయని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమాజానికి ఏదో చేయాలన్న తపన పవన్లో ఉందని, ఎన్నకల ప్రచారంలో సహకారం కోరేందుకు పవన్ను కలిశానని ఆయన తెలిపారు. మోడీ, పవన్, తనది ఒకటే ఆలోచన అని దేశం బాగుపడాలన్నదే తమ తపన అని తెలిపారు. ఎన్టీఏ అభర్థులు గెలవాలి, ఇరు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నారు.