బైక్ నడిపిన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టకు.. మంచిదికాదు: నిమ్మల
అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ శుక్రవారం నాడు ద్విచక్ర వాహనం నడిపారు. ప్రజలను కలిసి ఆయన సమస్యలు తెలుసుకుంటున్నారు.
ఈ సందర్భంగా కొండికొండ చెక్ పోస్టు నుంచి కనుమ వరకు బైక్ నడిపారు. హిందూపురం మార్కెట్ యార్డు నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
పవన్ రెచ్చగొట్టొద్దు: నిమ్మల
రాజధాని కోసం భూసేకరణ ఎలా చేయాలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పాలని ఎంపీ నిమ్మల కిష్టప్ప శుక్రవారం నాడు ప్రశ్నించారు. రైతులను రెచ్చగొట్టడం పవన్ కళ్యాణ్కు మంచిది కాదన్నారు. భూసేకరణ పైన ప్రజలకు తమ ప్రభుత్వం సమాధానం చెబుతుందన్నారు. భూసేకరణ చేయకుండా రాజధానిని ఎలా నిర్మిస్తారో చెప్పాలన్నారు.
వెంకయ్యపై నారాయణ మండిపాటు
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పైన సిపిఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను లేకుంటే మీకు దిక్కులేదు అన్న వెంకయ్య వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వెంకయ్య ధోరణి తన కోడి లేకపోతే తెల్లవారదు అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
ఏపీ పైన ప్రేమ ఉందని చెబుతున్న వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీలది కొంగ జపమే అన్నారు. తల్లిపాలకు, పోతపాలకు తేడా లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు, ప్రత్యేక
రాజధాని ప్రాంత రైతుల ఆందోళన
ఏపీ రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నిడమర్రి గ్రామాల్లో శుక్రవారం నుంచి భూసేకరణ చేయనుండటంతో ఆ గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
మూడు పంటలు పండే తమ భూములను భూసేకరణ, భూసమీకరణ ద్వారా తీసుకోకుండా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు సీపీఎం, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం భూములను తీసుకుంటే ఏయే పంటకే నష్టం జరుగుతుందనే విషయాన్ని తెలిపేందుకు పండ్లు, కూరగాయలతో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు.