బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దు: ఎందుకంటే?
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన రద్దయింది. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానం 4 గంటలు ఆలస్యం కావడంతో పర్యటన రద్దు చేసుకున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం వర్చువల్ ద్వారా ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు.
తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ఏపీ పార్టీ వ్యవహారాలను కూడా చూసుకుంటున్నారు. తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించిన బీజేపీ అధిష్టానం.. ఆయనకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చింది. ఆయన సేవలను ఇతర రాష్ట్రాల్లోనూ వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఏపీ ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తోపాటు ఓటర్ల నమోదు ప్రక్రియ బాధ్యతలను పార్టీ నాయకత్వం ఆయనకు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ తోపాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశాలలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.
తెలంగాణ బీజేపీలో సరికొత్త జోష్ తీసుకొచ్చిన బండి సంజయ్కు ఏపీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయంగా మారింది. ఏపీలోనూ బీజేపీని మరింత ఉత్సాహంగా నడిపించేందుకు బండి సంజయ్కు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలే కలిసి పోటీ చేస్తాయా? టీడీపీని కూడా కలుపుకుని మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు కొంత సమయం ఉండటంతో పొత్తులపై ఇంకా ఏ పార్టీ కూడా స్పష్టమైన వైఖరిని ప్రకటించడం లేదు. కాగా, ఏపీకి చెందిన జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలో ఓటరు నమోదుకు బాధ్యత వహిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు రేఖా వర్మ నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications