ఈనెల 21వ తేదీన ఏం జరగబోతోంది?
భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి 26 మందితో తన టీమ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన నాటినుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈనెల 21వ తేదీ తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అమరావతి వస్తున్నారు. రాష్ట్రంలో నమోదువుతున్న ఓట్ల ప్రక్రియకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశా ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించే బాధ్యతను కూడా పార్టీ బండి సంజయ్కు అప్పగించింది. ఓటర్ల నమోదు ప్రక్రియను ఆయన సమీక్షిస్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఓట్ల నమోదు ప్రక్రియకు సంబంధించి ఆరోపణలు చేస్తున్నాయి. సమీక్ష తర్వాత బండి సంజయ్ ఏం మాట్లాడతారు? అనేది ప్రధానంగా మారింది.

కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో అమిత్ షా, జేడీ నడ్డాను టీడీపీ అధినేత చంద్రబాబు కలవడం జరిగింది. ఎన్డీయేలో చేరుతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ అవి వాస్తవరూపం దాల్చలేదు. ఆ తర్వాతే ఏపీకి అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని, తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. ఎన్డీయే మిత్రుల సమావేశం జరిగినప్పటికీ టీడీపీకి ఆహ్వానం అందలేదు.
బాధ్యతలు చేపడుతూనే పురంధేశ్వరి పదునైన విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నారు. ఏపీ అధ్యక్షుడిగా సత్యకుమార్ కు కాకుండా చివరి నిముషంలో అనూహ్యంగా పురంధేశ్వరిని ఎంపిక చేయడంపై బీజేపీ ఏం ఆశిస్తోందా? అని రాజకీయ వర్గాలు ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ఓట్ల నమోదుకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నవాటినే బండి సంజయ్ ప్రస్తావిస్తారా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాలంటే 21 వరకు ఆగక తప్పదు.












Click it and Unblock the Notifications