పవన్ కల్యాణ్కు కొత్త చిక్కులు..!!
తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇవ్వాళ తిరుపతిలో ప్రత్యక్షం అయ్యారు. భారీ కాన్వాయ్తో ఎంట్రీ ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులతో కలిసి విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
అనంతరం పవన్ కల్యాణ్.. ర్యాలీగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లాలోని శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజు యాదవ్పై లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తికి చెందిన పార్టీ కార్యకర్త కొట్టె సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజు యాదవ్పై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

ఈ చర్య బీసీ సంఘాల్లో ఆగ్రహానికి దారి తీసింది. ఆయనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు ఏకం అయ్యారు. అంజు యాదవ్.. ఓ బీసీ మహిళ కావడం వల్లే పవన్ కల్యాణ్ ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారని, ఆయనకు తగిన బుద్ధి చెబుతామనీ హెచ్చరించారు.
యాదవ సామాజిక వర్గానికి చెందిన అంజూ యాదవ్తో జనసేన కార్యకర్త కొట్టే సాయికి ఎలాంటి పరిచయం లేదని, శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నంలో భాగంగా, ఓ సీఐ హోదాలో ఆమె.. ఆయనను మందలించారని చెబుతున్నారు. కొట్టే సాయితో అంజు యాదవ్కు పాత కక్షలు ఉన్నట్లుగా పవన్ కల్యాణ్ చెబుతున్నారంటూ మండిపడుతున్నారు.
అంజూ యాదవ్తో తనకు ఎలాంటి సబంధం లేదంటూ చివరికి కొట్టే సాయినే స్పష్టం చేశారంటూ తిరుపతి జిల్లా ఎస్పీ సైతం చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించినందు వల్లే జనసేన కార్యకర్తలను చెదరగొట్టడానికి అంజూ యాదవ్ ప్రయత్నించారని స్పష్టం చేస్తోన్నారు.
శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ జోలికొస్తే పవన్ కళ్యాణ్ తాట తీస్తాం - యాదవ సంఘం నేతలు#AnjuYadav #CIAnjuYadav #PawanKalyan #JANASENA #SrikalahastiCI #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/S2pZCeyljo
— oneindiatelugu (@oneindiatelugu) July 17, 2023
ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు నియంత్రణ కోల్పోయి పోలీసుల మీదకే దాడి చేసే పరిస్థితి నెలకొందని, ఇక వేరే మార్గం లేకపోవడం వల్ల పరిస్థితి అదుపు చేసే క్రమంలో అంజూ యాదవ్ కొట్టారని చెబుతున్నారు. విధి నిర్వహణలో అంజూ యాదవ్ కఠినంగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తారని, అలాంటి వారిని ప్రశంసించాల్సింది పోయి, ఫిర్యాదులు చేయడంలో అర్థం లేదని బీసీ సంఘాల నాయకులు పేర్కొంటోన్నారు.
గతంలో అధికార వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రను సైతం అంజు యాదవ్ ఇలాగే దండించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు అయినా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి తలెత్తితే ఓ సీఐగా ఆమె ఏమాత్రం సహించలేరని వ్యాఖ్యానిస్తోన్నారు.
మహిళలు సమాజంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిమంతంగా ఉండాలని, అన్యాయాలను ఎదిరించాలంటూ పిలుపునిచ్చే పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తన విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తోన్న ఓ మహిళా బీసీ పోలీస్ పట్ల ఫిర్యాదు చేయడం సరికాదంటూ బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications