జగన్పై అనవసరంగా, టీడీపీ నేతల వ్యాఖ్యలే: పరకాల రాజీనామా వెనుక మరో కోణం!
అమరావతి: ఏపీ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ పది రోజుల క్రితం రాజీనామా చేశారు. ఇది సంచలనం సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఆయన రాజీనామా చేశారని అధికార టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. పరకాల కూడా తనపై కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాధించాయన్నారు.
'పరకాలా! ముద్దాయి మాటలు పట్టించుకోకు, రిజైన్కు బాబు నో!': జగన్ ఏమన్నారు, ఆయన వల్లేనా?
మొత్తానికి పరకాల రాజీనామా.. వైయస్ జగన్ వ్యాఖ్యల వల్లేనని టీడీపీ నేతలు ఆరోపించారు. జగన్ ఎన్నో కేసుల్లో ముద్దాయి అని, అలాంటి నేతల మాటలు పరకాల పట్టించుకోవద్దని, కాబట్టి రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కూడా కొంతమంది టీడీపీ నేతలు సూచించారు. చంద్రబాబు ఈ రాజీనామాను ఆమోదించరని కొందరు అభిప్రాయపడ్డారు.
జగన్ మీదకు నెపం
తాజాగా, ఆయన రాజీనామాకు మరో కారణం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం జగన్ మీదకు వెళ్లిందనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీడియాలో ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. పరకాల రాజీనామాకు టీడీపీ నేతలు కూడా కారణమని అంటున్నారు.
Recommended Video
ట్విస్ట్.. పరకాలపై టీడీపీ నేతల వ్యాఖ్యలు
పరకాల ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్రానికి తన సతీమణి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా అందిస్తున్నారని కొంతమంది టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం బాధ కలిగించిందని పరకాల వాపోయారని తెలుస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. రాజీనామాపై వెనక్కి తగ్గాలని సీఎం చంద్రబాబు కోరినా ఈ కారణంతో ఆయన తగ్గలేదని అంటున్నారు.
జూలై 4న పదవీకాలం ముగిసే సమయంలో
మరో విషయం ఏమంటే పరకాల ప్రభాకర్ పదవీకాలం జూలై 4వ తేదీన ముగుస్తుంది. ఆయన రాజీనామా చేయకుంటే ఆయనను కొనసాగించేవారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. పదవీకాలం ముగిసే పదిహేను ఇరవై రోజుల ముందు రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.
జగన్ ఏమన్నారంటే
పరకాల రాజీనామాకు ముందు రోజు వైయస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో మాట్లాడుతూ.. బీజేపీతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. నిర్మలా సీతారామన్ భర్త ప్రభాకర్ ఇంకా చంద్రబాబు సలహాదారుగా ఉన్నారని అంటే బీజేపీతో సంబంధాలు ఉన్నట్లే కదా అన్నారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి సతీమణికి టీటీడీ బోర్డు సభ్యురాలిగా పదవి ఇచ్చారన్నారు. ఈ ఆరోపణలపై పరకాల మనస్తాపం చెందారని చెప్పారు. కానీ టీడీపీ నేతల వ్యాఖ్యలు కూడా ఆయనను బాధించాయని కొత్త విషయం ప్రచారంలోకి రావడం గమనార్హం.