మోడీ పైకి ఎగదోస్తున్నారు: పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యల వెనుక!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఏం చేయడం లేదని, వ్యాపారాల పైన దృష్టి సారిస్తున్నారన్న పవన్ వ్యాఖ్యల పైన కొందరు టిడిపి నేతలు భగ్గుమన్న విషయం తెలిసిందే.
ఆయన పైన దుమ్మెత్తి పోశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అయితే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరికొందరు టిడిపి నేతలు కూడా ఆయన పైన మండిపడ్డారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వద్దని చెప్పినప్పటికీ కేశినేని నాని విమర్శలు గుప్పించినట్లుగా వార్తలు వచ్చాయి.
తన పైన తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురు దాడికి దిగడంతో.. పవన్ కళ్యాణ్ గురువారం నాడు మరోసారి ట్విట్టర్ వేదికగా సీమాంధ్ర ఎంపీల పైన మండిపడ్డారు. విభజన బిల్లు సమయంలో ఎంతమంది సభలో ఉన్నారని, చర్చలో ఎంతమంది పాల్గొన్నారని ఘాటుగా ప్రశ్నించారు. కేవలం 5గురే ఉన్నట్లు తనకు తెలుస్తోందన్నారు.
ప్రశ్నల వర్షం
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ ఒకింత స్పష్టతతో ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఎంపీలను ప్రశ్నించడం ద్వారా వారిని ఒక్కతాటి పైకి తెచ్చి ఏపీకి ప్రత్యేక హోదా సాధించేలా చేయడమే ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తోందని అంటున్నారు.
ప్రస్తుతానికి చట్టసభల్లో జనసేనకు ప్రాతినిథ్యం లేదు. కాబట్టి ఎంపీల పైన ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా గురించి పోరాడేలా చేయడమే ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడాలని ఆయన సూటిగా సీమాంధ్ర నేతలకు సూచిస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి - టిడిపిలకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేక హోదా పైన టిడిపిని ప్రశ్నించడం, కేంద్రం పైన పోరాటం చేయాలని సూచించడం గమనార్హం. అయితే, టిడిపి మాత్రం పవన్ వ్యాఖ్యల పైన ఆచితూచి స్పందించాలని చూస్తోంది. పవన్ కళ్యాణ్ ట్వీట్లు.. టీడీపీ ఎంపీలకు సమాధానాలు ఇవ్వడం, వారిపై ఒత్తిడి తేవడం లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు.