రాంగోపాల్ వర్మకు భారీ ఊరట-హైకోర్టు కీలక ఆదేశాలు..!
గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మకు ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై పలు స్టేషన్లలో నమోదైన కేసులపై ఊరట కల్పిస్తూ హైకోర్టుకీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయింది.
వైసీపీ అధినేత జగన్ పై రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై రాష్ట్రంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా వర్మ ప్రకాశం జిల్లా పోలీసుల ముందు హాజరయ్యారు కూడా. ఈ నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన కేసులన్నీ కొట్టేయాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

రాంగోపాల్ వర్మపై ఆరు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు గతంలో చంద్రబాబు, పవన్, లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వర్మ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రకాశం జిల్లా మద్దిపాటు పోలీసులు నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. అదే సమయంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
అయితే పోలీసుల విచారణకు హాజరు కావాలని షరతు పెట్టడంతో ఆ తర్వాత వర్మ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఏకంగా ఈ కేసులన్నీ కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వ స్పందన వచ్చే వరకూ ఆయనకు ఊరట లభించింది.












Click it and Unblock the Notifications