తన పేరు చివర్లో ఉందని పీతల సుజాత అలక, భన్వర్లాల్తో విజయసాయి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పీతల సుజాత అలక వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాల కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. బాల కేంద్రాన్ని మరో మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు.
ఇదే కార్యక్రమానికి మంత్రి సుజాత, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, శివరామరాజు, ఎమ్మెల్సీ సూర్యారావులను ఆహ్వానించారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి సంబంధించిన శిలా ఫలకంలో తన పేరు చివరన ఉండటంతో సుజాత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో, ఆమె కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. తమ నాయకురాలికి అవమానం జరిగిందని మంత్రి పీతల సుజాత అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరవాసరంలో గ్రంథాలయ భవన ప్రారంభోత్సవం జరిగింది. దీనిని ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సుజాతను ఆహ్వానించలేదని అనుచరులు నిరసన తెలిపారు.
ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్తో విజయ సాయి భేటీ
ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్తో ఎంపీ విజయ సాయి రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఏపీలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను మరో నెల రోజుల పాటు పొడిగించాలని భన్వర్ లాల్ను సాయి రెడ్డి కోరారు. తక్కువ సమయం ఉండటంపై గ్రాడ్యుయేట్ పట్టభద్రులు తమ ఓటు నమోదు చేసుకోవడానికి ఇబ్బంది పడతారన్నారు. ఓటు నమోదు ప్రక్రియను పొడిగించాలని కోరారు.