బీజేపీకి హ్యాట్రిక్ దెబ్బ-ఆత్మకూరులోనూ డిపాజిట్ లాస్-తిరుపతి, బద్వేలు తర్వాత మూడోసారి
ఏపీలో గతంలో టీడీపీ సాయంలో పలు ఎన్నికల్లో విజయాలు అందుకున్న బీజేపీకి 2019 నుంచి కష్టకాలం నడుస్తోంది. గతంలో 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టినట్లే ఏపీ ప్రజలు 2019 తర్వాత బీజేపీని కూడా దూరం పెట్టేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కీలకమైన ఎన్నికల్లో అభ్యర్ధుల్లేక దూరంగా ఉండిపోతుంటే బీజేపీ మాత్రం దొరికిన అభ్యర్ధులతోనే కనీస బలం లేని చోట్ల పోటీ చేసి వరుసగా డిపాజిట్లు కోల్పోతోంది. ఇవాళ వెలువడిన ఆత్మకూరు ఉపఎన్నికల్లో ఓటమితో బీజేపీకి హ్యాట్రిక్ డిపాజిట్ నష్టాలు ఎదురయ్యాయి.

ఆత్మకూరులో బీజేపీ ఓటమి
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మృతితో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేశారు. సిట్టింగ్ ప్రజాప్రతినిధులు చనిపోతే వారి వారసులు పోటీలో ఉన్నప్పుడు పోటీకి దిగరాదనే ఒప్పందంతో టీడీపీ ఈ ఎన్నికకు దూరంగా ఉండిపోయింది. ఇక మిగిలింది బీజేపీ-జనసేన కూటమి మాత్రమే. మిగతా పార్టీలు పోటీలో ఉన్నా లేనట్లే. ఈ తరుణంలో ఆత్మకూరులో పోటీకి దిగిన బీజేపీ భరత్ కుమార్ ను అభ్యర్ధిగా నిలబెట్టి సర్వశక్తులొడ్డింది. అయితే జిల్లాలో వైసీపీ పట్టు, స్ధానిక సమీకరణాలు, ధనబలం, వాలంటీర్లు ఇలా ప్రత్యర్ధితో పోలిస్తే ఏ విషయంలోనూ ఆధిక్యం ప్రదర్శించలేకపోయిన బీజేపీకి ఘోర పరాజయం తప్పలేదు.

బీజేపీకి హ్యాట్రిక్ ఓటమి
ఆత్మకూరు ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ ఓడిపోవడంతో ఆ పార్టీకి రాష్ట్రంలో 2019 తర్వాత జరిగిన మూడు ఉపఎన్నికల్లోనూ ఓటమి వరించినట్లయింది. రాష్ట్రంలో పార్టీ బలంగా లేకపోయినా, మిత్రపక్షం జనసేన నుంచి పూర్తిస్దాయిలో సహకారం అందకున్నా బీజేపీ మాత్రం ఉపఎన్నికల్లో పోటీకి మాత్రం వెనుకాడటం లేదు. అయితే చివరి నిమిషంలో ప్రత్యర్ధుల వ్యూహాల్ని అర్ధం చేసుకోలేక, వారితో పోటీ పడలేక విమర్శలతో ప్రచారంలోనే వెనుకబడటం కాషాయ పార్టీకి పరిపాటిగా మారిపోయింది. దీంతో ఆత్మకూరులోనూ వరుస పరాజయం తప్పలేదు.

హ్యాట్రిక్ డిపాజిట్ లాస్
ఆత్మకూరు ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం కేవలం హ్యాట్రిక్ ఓటమే కాదు హ్యాట్రిక్ డిపాజిట్ నష్టం కూడా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసినా ఎక్కడా డిపాజిట్ తెచ్చులేకపోయిన బీజేపీ.. ఉపఎన్నికల్లోనూ అదే తరహాలో డిపాజిట్లు కోల్పోతోంది. గతంలో తిరుపతి, బద్వేల్ ఉపఎన్నికల్లోనూ బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. అయినా పట్టువదలకుండా ఆత్మకూరులో పోటీ చేసిన బీజేపీకి ఇక్కడా డిపాజిట్ నష్టం తప్పలేదు.

ఘోరపరాభవాలకు కారణాలివే ?
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్దితుల్లో ప్రధాన పార్టీలు నాలుగు మాత్రమే. ఇందులో అధికార వైసీపీతో పాటు విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ. ఏ విధంగా చూసినా వైసీపీ, టీడీపీతో పోలిస్తే మిగతా పార్టీలకు రాష్ట్రంలో స్ధిరమైన ఓటు బ్యాంకు లేదు. జనసేన గతంతో పోలిస్తే కాస్త ఓటు బ్యాంకు పెంచుకోగలుగుతోంది. కానీ బీజేపీకి మాత్రం రాష్ట్రంలో స్ధిరమైన ఓటు బ్యాంకే కాదు, ఆ పార్టీ మీద స్ధిరమైన అభిప్రాయం కూడా ఇక్కడి ఓటర్లకు లేదు. అదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ విషయంలోనూ సహకారం అందడం లేదు. దీంతో ఏపీ ప్రజలకు బీజేపీ పేరెత్తితేనే చిర్రెత్తుకొస్తోంది. దాని ఫలితమే ఈ వరుస డిపాజిట్ నష్టాలు. తాజాగా రాష్ట్రంలో వరుసగా కేంద్రమంత్రులు పర్యటిస్తున్నా, కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్నా ఏపీ ప్రజలు మాత్రం ఇవేవీ నమ్మడం లేదని ఈ డిపాజిట్ నష్టాలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications