ఏపీలో 5 లోక్సభ నియోజకవర్గాలపై దృష్టిపెట్టిన బీజేపీ!
దక్షిణాదిలో బలహీనంగా ఉన్నామని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ ఇక్కడ కూడా బలపడాలని భావిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఇప్పటినుంచే అన్ని ప్రయత్నాలను ప్రారంభించింది. సాధారణ ఎన్నికల్లో ఉత్తరాదిలో లోక్సభ సీట్లు తగ్గితే ఆ లోటును దక్షిణాదినుంచి పూడ్చుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సొంతంగా ఐదు నియోజకవర్గాలను గెలుచుకోవడానికి వ్యూహం రచించారు.

నివేదికలు తెప్పించుకుంటున్న ఢిల్లీ నేతలు
విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి నియోజకవర్గాలపై బీజేపీ పూర్తిగా దృష్టిసారించింది. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. రాష్ట్ర నేతలు తమ పని తాము చేసుకుంటుండగానే మరోవైపు ఢిల్లీ నేతలు తమ బృందాలతో నివేదికలు తెప్పించుకుంటున్నారు. 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని తిరుపతి, నర్సాపురం, రాజమండ్రి లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది. తిరిగి 2014 ఎన్నికల్లో నర్సాపురంతోపాటు విశాఖపట్నాన్ని గెలుచుకుంది.

పొత్తులు ఉన్నా, లేకపోయినా ఇక్కడి నుంచి గెలివాలి..
గతంలో ఈ ఐదు నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు పడ్డాయి.. విజయం సాధించింది కాబట్టి ఆ మూలాలు ఉంటాయని, వాటిని పునాదిగా వేసుకొని విజయం సాధించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. జనసేన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఇరుపార్టీల మధ్య గతంలో ఉన్న సఖ్యత ఇప్పుడు లేదు. కరోనావల్ల తమ మధ్య భౌతిక దూరం పెరిగిందని జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో పొత్తుతో వెళ్లడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఢిల్లీ అధిష్టానం ఇప్పటివరకు స్పందించలేదు. పొత్తులు ఉన్నా, లేకపోయినా వీటిల్లో విజయం సాధించాలనే యోచనతో మాత్రం బీజేపీ నేతలున్నారు.

తమ పని తాము చేసుకుంటామంటున్న బీజేపీ నేతలు
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకే జనసేన మొగ్గుచూపుతుండటంతో ఈ విషయంలో బీజేపీ స్పష్టత ఇవ్వడంలేదు. ఇరు పార్టీల మధ్య పొత్తు విషయమే సందిగ్ధంలో పడుతుండటంతో టీడీపీతో పొత్తు గురించి ఢిల్లీ అధిష్టానం తేలుస్తుందని, అప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో తమ పని తాము చేసుకుంటామని బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు. కేంద్రంలో అవసరమైనప్పుడల్లా వైసీపీ తమకు మద్దతిస్తోందని, ఆ మైత్రిని వదులుకోదని కొందరు నేతలు చెబుతుండగా, ఎన్నికల సమయానికి పరిణామాలన్నీ మారిపోతాయని, అప్పటి పరిస్థితులనుబట్టి టీడీపీ, జనసేనతో కలిసివెళ్లే అవకాశం ఉందని మరికొందరు నేతలు చెబుతున్నారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఢిల్లీ పెద్దలు చెప్పినదాని ప్రకారమే పొత్తులు ఆధారపడివుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications