పాతబస్తీలో 5 సీట్లపై బిజెపి గురి, బాబుతో కృష్ణంరాజు
తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదిరినా, కుదరకపోయినా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పోటీకి సై సిద్ధమవుతోంది. టిడిపితో పొత్తు కుదిరిన పక్షంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలు తమకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. ఒంటరిగా బరిలోకి దిగితే అన్ని స్థానాల్లో స్థానికంగా పట్టు ఉన్న అభ్యర్థులను బరిలోకి దింపే యోచనలో ఉంది. టిడిపితో పొత్తు కుదిరితే మాత్రం ఐదు స్థానాలు కోరనుంది.
ప్రధానంగా ఐదు స్థానాల పైన కన్ను వేసింది. హైదరాబాదు పార్లమెంటు పైనా దృష్టి సారించింది. చార్మినార్, యాకుత్ పురా, చాంద్రాయణగుట్ట, కార్వాన్, నాంపల్లి స్థానాలు కావాలని బిజెపి టిడిపిని డిమాండ్ చేస్తోంది. ఇందులో యాకుత్ పురా ఇచ్చేందుకు టిడిపి సిద్ధంగా ఉంది.
పాతబస్తీ బిజెపికి పట్టుగొమ్మ. ఆ పార్టీ ఎదిగిందే ఆ ప్రాంతం నుండి. పాతబస్తీలో మజ్లిస్ సిటింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో బిజెపి అభ్యర్థులు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బిజెపి కోరుతున్న ఐదు అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల గెలువడం కష్టమని తెలిసినప్పటికి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2008 ఎన్నికల్లో పాతబస్తీలోని అన్ని స్థానాల్లో బిజెపి పోటీ చేసి ఉనికిని కాపాడుకుంది.
చంద్రబాబును కలిసిన కృష్ణం రాజు
బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి కృష్ణం రాజు సోమవారం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. సీమాంధ్రలో బిజెపి టిడిపి మధ్య పొత్తు కుదరనున్న నేపథ్యంలో కృష్ణం రాజు.. బాబును కలిశారని సమాచారం. కాకినాడ నుండి లోకసభకు పోటీ చేయాలనుకుంటున్నారని సమాచారం.