ఏరు దాటాక బోడి మల్లన్న తరహాలో-వైసీపీ సర్కార్ ప్రజలను మోసం చేసింది : విష్ణు వర్ధన్ రెడ్డి
ఏపీలో ఆస్తి పన్ను పెంపుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఆస్తి పన్ను పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు పన్ను పెంపుపై నోరు మెదపని ప్రభుత్వం... ఎన్నికల తర్వాత పన్నులు పెంచి ప్రజలను మోసం చేసిందన్నారు.
ఏరు దాటేవరకు ఓడ మల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్న అన్న తరహాలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.పైగా కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే పన్నులు పెంచుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో పన్నుల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటుందా లేక కేంద్రం పరిధిలో ఉంటుందా అని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం పన్నులు పెంచాలని ఆదేశాలిస్తే... అన్ని రాష్ట్రాల్లోనూ పన్నులు పెరగాలి కదా అన్నారు. కేవలం ఏపీలో మాత్రమే పన్నులు పెరిగి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పెరగట్లేదని ప్రశ్నించారు.
ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక ఏం చేసినా చెల్లుతుందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రజలకు ఓ చేతిలో డబ్బులు పెట్టినట్లే పెట్టి... మరో చేతితో లాగేసుకుంటోందన్నారు. పన్నుల విషయంలో విపక్షాలే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మాట్లాడటం సరికాదన్నారు. పన్నుల భారంపై ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా బీజేపీ పోరాడుతుందన్నారు.
కరోనా కారణంగా ఇప్పటికే ఉద్యోగ,ఉపాధి కోల్పోయిన ప్రజలపై ఆస్తి పన్ను పెంపు రూపంలో మరో భారం మోపడాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గతంలో మున్సిపాలిటీల్లోని ప్రాంతాలను ఏ,బీ,సీ జోన్లుగా విభజించి పన్నులు వసూలు చేసేవారు. ఈ విధానంలో సంపన్న వర్గాలు ఉండే ప్రాంతాల్లో ఎక్కువ పన్ను,పేదవాళ్లు ఉండే మురికివాడల్లో తక్కువ పన్ను ఉండేది. కానీ కొత్త విధానంలో అన్ని ప్రాంతాల్లోని గృహాలకు 0.15శాతం,వాణిజ్యేతర భవనాలకు 1.30 శాతం ఆస్తి పన్ను వసూలు చేయనున్నారు.
దానికి తోడు చెత్త పన్ను విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలతో పాటు ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాలు,పట్టణాల్లో విపక్షాలు ఇప్పటికే ఆందోళనలు చేపట్టాయి. ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశాయి.
Recommended Video