రీల్ వీడియో కోసం బంగారం ఫ్రీ షో.. ఉన్నదంతా ఊడ్చేసిన వైనం..!
సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం చేసే అతి ప్రదర్శన కొన్నిసార్లు ఊహించని తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ప్రముఖ యూట్యూబర్ రచన గుర్జర్ విషయంలో జరిగిన తాజా ఘటన ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. తన వద్ద ఉన్న బంగారు నగలను ధరించి, వాటిని వీడియోల ద్వారా నెటిజన్లకు ప్రదర్శించడం ఆమెకు పెద్ద సమస్యను కొనితెచ్చింది. దీనిని గమనించిన దొంగలు, పక్కా ప్లాన్తో ఆమె ఇంట్లో విలువైన సొమ్మును దోచుకెళ్లారు.
మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా, నవాబ్ సాహబ్ రోడ్డు నివాసి అయిన రచన యూట్యూబ్లో నిత్యం యాక్టివ్గా ఉంటారు. తన రోజువారీ జీవితంలోని విశేషాలను, ఖరీదైన ఆభరణాలను చూపిస్తూ ఆమె తరచూ వీడియోలు, రీల్స్ చేస్తుంటారు. ఆమె పోస్ట్ చేసిన కంటెంట్ను క్రమం తప్పకుండా గమనించిన కొందరు దుండగులు, ఆమె ఇంట్లో భారీగా బంగారం ఉందనే విషయాన్ని గుర్తించారు. ఎలాగైనా ఆ నగలను దోచుకోవాలని వారు పథకం రచించారు.

కొద్దిరోజుల క్రితం కుటుంబంతో కలిసి రచన ఒక వివాహ వేడుకకు వెళ్లగా, ఇంటికి తాళాలు వేసి ఉన్నారు. ఇదే అదనుగా భావించిన దుండగులు అర్ధరాత్రి వేళ దాడులకు తెగబడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, అల్మారాలో దాచి ఉంచిన సుమారు రూ. 8 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకొని పరారయ్యారు. పెళ్లి ముగించుకుని తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంటర్నెట్లో లైక్స్ కోసం మన ఇల్లు, కొత్తగా కొన్న ఖరీదైన వస్తువులు లేదా ఊరెళ్తున్న విషయాలను షేర్ చేయడం వల్ల నేరగాళ్లకు మనమే స్వయంగా అవకాశమిచ్చినట్లవుతుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా వాడకంలో ప్రతి యూజర్ మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications