టీడీపీ- పవన్ తో పొత్తు పై తేల్చేసిన బీజేపీ - కన్నా వ్యాఖ్యలపైనా..!!
ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై బీజేపీ అప్రమత్తమైంది. తమ విధానం స్పష్టం చేసింది. చంద్రబాబు స్వయంగా వచ్చి పవన్ తో కలవటం.. పొత్తు పైన సంకేతాల నేపథ్యంలో బీజేపీ ఏపీ కో-కన్వీనర్ సునీల్ దేవధర్ స్పందించారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని..ఎటువంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. టీడీపీ -వైసీపీ రెండు కుటుంబ పార్టీలని.. అందులో ఒకరు నాగరాజు - మరొకరు సర్పరాజు అని వ్యాఖ్యానించారు. రెండు దొంగ పార్టీలంటూ ఆరోపించారు.
కుటుంబ, అవినీతి పార్టీలపై తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసారు. విశాఖ ఘటన విషయంలో బీజేపీ నేతలు చాలా మంది పవన్తో మాట్లాడారని.. సంఘీభావం తెలిపారని వివరించారు. రోడ్ మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు టీడీపీ అధినేత లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. తమ మిత్రపక్ష నేతను చంద్రబాబు కలవటాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా కాన్వాయ్ పైన జరిగిన రాళ్ల దాడిని వీర్రాజు ప్రస్తావించారు. చంద్రబాబు తన హయాంలో జరిగిన ఘటనలు..పరిణామాలు గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడే ముందు అవన్నీ గుర్తు చేసుకోవటం అవసరమని చెప్పారు. పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు పార్టీ అధినాయకత్వం దృష్టిలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో అన్నీ ఉంటాయని వ్యాఖ్యానించారు. కన్నా వ్యాఖ్యలను అలాగే చూస్తున్నామని వివరించారు. ఇదే అంశం పైన స్పందించిన సునీల్ దేవధర్ పార్టీ వైఖరి ఏంటో సోము వీర్రాజు చెప్పారని..అంతకు మించి తాను చెప్పేది ఏదీ లేదన్నారు.