బాబు ప్రకటిస్తే.. దేనికైనా సిద్ధంకండి: బీజేపీ నేతలకు ఢిల్లీ ఫోన్, బీజేపీ మంత్రుల రాజీనామా?
అమరావతి: విభజన చట్టంలోని హామీలు, ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అసెంబ్లీలో నిధులపై మాట్లాడే అవకాశాలున్నాయి. బీజేపీపై విమర్శలు, ఆ తర్వాత పొత్తను తెంచుకునే ప్రకటన కూడా చేయవచ్చు.
Recommended Video
ఈ నెలాఖరులో బీజేపీకి గుడ్బై: జేసీ సంచలనం
టీడీపీ అడుగులను గమనిస్తున్న బీజేపీ కూడా అందుకు సిద్ధంగా ఉంది. టీడీపీ అడుగులను బట్టి తాము ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ నుంచి ఏపీ బీజేపీ నేతలకు ఫోన్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
దేనికైనా సిద్ధంగా ఉండండి
ఎలాగు పొత్తు విచ్ఛిన్నం ఖాయమని, రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని ఏపీ బీజేపీ నేతలకు పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. కేంద్రమంత్రులు ఎన్డీయే నుంచి వైదొలిగిన మరుక్షణమే మీరు కూడా రాజీనామా చేయాలని సూచించారు.
ఢిల్లీ నుంచి కామినేనికి ఫోన్
ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు మంత్రి కామినేని శ్రీనివాస్ రావుకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని తెలుస్తోంది. ఎంపీ కంభంపాటి హరిబాబుతో ఏపీ బీజేపీ నేతలు ఫోన్లో మంతనాలు సాగించారని తెలుస్తోంది.
టీడీపీ యాక్షన్కు అనుగుణంగా
తెలుగుదేశం పార్టీ యాక్షన్కు అనుగుణంగా తమ రియాక్షన్ ఉంటుందని మంత్రి కామినేని చెప్పారు. టీడీపీ కేంద్రమంత్రుల కంటే ముందే రాజీనామాలు ఇచ్చే అంశంపై వారు స్పందించడం లేదు.
చంద్రబాబు ప్రకటన చేస్తే తెగదెంబులే
చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా సభలో ప్రకటన చేస్తే వెంటనే రాజీనామాలు చేయాలని కూడా బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటూ సీఎం ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అప్రమత్తమైంది. సీఎం ప్రకటన చేస్తే రాజీనామాకు సిద్ధమని అంటున్నారు.
కేంద్రమంత్రులు, ఏపీ మంత్రులు
2014లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కేబినెట్లో ఇద్దరు బీజేపీ నేతలకు చోటు కల్పించారు. మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్ రావులు ఉన్నారు. కేంద్రంలో టీడీపీ నుంచి ఇద్దరికి మంత్రులుగా అవకాశం కల్పించారు. సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు ఉన్నారు.