టీడీపీపై కోపం హోదాకు అడ్డుకావొద్దు: బీజేపీకి పవన్, ముఖ్యమైన రోజు: మోడీ
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ప్రత్యేక హోదా గురించి ఓ పోస్టు పెట్టారు. తెలుగుదేశం నాయకత్వంపై బీజేపీ ఆగ్రహం.... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం కాకూడదని ఆకాంక్షించారు.
ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అడిగే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తాను కూడా కలుస్తున్నానని జనసేనాని మరో ట్వీట్ చేశారు. మన హక్కులను తెలపడానికి పార్లమెంటుకు మించిన వేదిక లేదని పేర్కొన్నారు.
కాగా, అంతకుముందు ప్రధాని మోడీ ట్విట్టర్లో అవిశ్వాసంపై స్పందించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు ముఖ్యమైన రోజని మోడీ అన్నారు. అవిశ్వాసం తీర్మానంపై సమగ్రమైన, నిర్మాణాత్మకమైన చర్చకు సభ్యులందరూ సహకరిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
విభజన చట్టపరంగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలుతో పాటు అన్నింటిని తెలియచెప్పాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోకసభలో చర్చకు సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు గల్లా జయదేవ్ ప్రసంగంతో చర్చ మొదలై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ప్రధాని మోడీ ఇచ్చే సమాధానంపై సభ్యులు వివరణ కోరవచ్చు.