ఓ నాయుడు ఆలా, ఓ నాయుడు ఇలా: వెంకయ్య, బాబులపై బొత్స
హైదరాబాద్: విభజన చట్టంలోని హామీలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఓ విధంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో విధంగా మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఓ నాయుడలా అంటారు, మరో నాయుడిలా అంటారు అని ఆయన వ్యాఖ్యానించారు.
బొత్స సత్యనారాయణ శనివారంనాడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు చేశాం, చేస్తున్నామని వెంకయ్య నాయుడు అంటున్నారని, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని చంద్రబాబు అడుగుతన్నారని, వీరిద్దరు కలిసి ఉంటారు, కలిసి డిన్నర్ చేస్తారని, అయినా ఎందుకు అయోమయం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానంలో వెళ్తున్నారని, స్పెషల్ స్టేటస్ కావాలి కాబట్టి ప్రత్యేక విమానంలో వెళ్తున్నారని, ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి సాధించింది ఏమిటని ఆయన అన్నారు. రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లారా అని ఆయన అడిగారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా అయోమయ పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రయోజనాల గురించి కాకుండా చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారని ఆయన అడిగారు. వెంకయ్య నాయుడు గానీ చంద్రబాబు గానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదని, ఆ విషయాన్ని మరుగున పడేస్తున్నారని బొత్స విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మానిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయడం లేదని ఆయన అన్నారు.