ఊహలొద్దు వాస్తవాలు కావాలి: చంద్రబాబుకు బ్రిటన్ షాక్, టూర్ రద్దు
ఊహాజనిత ప్రజేంటేషన్ కాకుండా ఇప్పటిదాకా సాధించిన పురోగతి ఏదైనా ఉంటే చెప్పండి అని బ్రిటన్ వర్గాలు ఆదేశించడంతో సీఎం ఏకంగా తన టూర్నే రద్దు చేసేసుకున్నారు.
సాక్షి: అంతర్జాతీయ వేదిక మీద తన అభివృద్ది ప్రణాళికల గురించి గొప్పగా చాటుకోవాలనుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు భంగపాటు తప్పలేదు. ఊహాజనిత ప్రజేంటేషన్ కాకుండా ఇప్పటిదాకా సాధించిన పురోగతి ఏదైనా ఉంటే చెప్పండి అని బ్రిటన్ వర్గాలు ఆదేశించడంతో.. ఏకంగా తన టూర్నే రద్దు చేసుకున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు స్థానంలో మంత్రి నారాయణ బ్రిటన్ పర్యటనకు వెళ్లడానికి సిద్దమవుతున్నారు. కాగా, బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ విభాగం ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు లండన్ లో ఇంటర్నేషనల్ ట్రేడ్ వాటర్ టెక్నాలజీపై ప్రదర్శన ఏర్పాటు చేసింది.
ఆధునిక సాంకేతికాభివృద్ది,మార్కెటింగ్ మరియు దాని విస్తృత పరిధి వంటి అంశాలను ఈ సదస్సు ద్వారా చర్చించనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వానికి సైతం బ్రిటన్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో భవిష్యత్తులో తాను చేపట్టబోయే అభివృద్ది ప్రణాళికలు, అమరావతిని తాను ఏవిధంగా తీర్చిదిద్దబోయేది వివరిస్తూ ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారుచేయాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు ఆ పనిలో నిమగ్నమైన అధికారులు.. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబుపై నమ్మకంతో రైతులంతా స్వచ్చందంగా భూములిచ్చారని, తన మాస్టర్ ప్లాన్స్ తో ఏపీకి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నారని, ఉద్యోగం, పర్యాటకం విషయాల్లో రాష్ట్రంలో పురోగతి వెల్లివిరుస్తోందని గ్రాఫ్ లతో సహా అద్భత ఊహాచిత్రాన్ని రూపొందించి ఏపీ అధికారులు దాన్ని బ్రిటన్ వర్గాలకు పంపించారు.
అధికారులు పంపించిన సీడీని పరిశీలించిన బ్రిటన్ వర్గాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఊహాజనిత అంశాలు కాకుండా వాస్తవరూపం దాల్చిన అంశాలను ప్రస్తావిస్తే బాగుంటుందని వారు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద బ్రిటన్ వర్గాలు ఇచ్చిన షాక్ తో సీఎం చంద్రబాబు తన పర్యటననే రద్దు చేసుకున్నారు.
ఆయన స్థానంలో మంత్రి నారాయణ బ్రిటన్ సదస్సులో పాల్గొనడానికి వెళ్తున్నట్టు సీఆర్డీఏ మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలిపారు.