కాల్ మనీ: చిచ్చు పెట్టిన టిడిపి కుమ్ములాటలు, చంద్రబాబుకు తలనొప్పి
విజయవాడ: తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలోని అంతర్గత విభేదాల వల్లనే కాల్ మనీ దందా గుట్టు రట్టయినట్లు చెబుతున్నారు. ఈ గుట్టును రట్టు చేయడంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కీలక పాత్ర వహించారనే మాట వినిపిస్తోంది. ఈయనపై కాల్ మనీ వ్యవహారంలో చిక్కుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. కేశినేని నానిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. దీంతో చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది.
ఓ కీలక నేత లీకులు ఇవ్వడం వల్లనే కాల్ మనీ దందాలో తెలుగుదేశం పార్టీలోని కొంత మంది పేర్లు బయటకు వచ్చాయని అంటున్నారు. కాల్ మనీ దందా విజయవాడలో ఎప్పటి నుంచో సాగుతున్నప్పటికీ అందులోని సెక్స్ రాకెట్ కుంభకోణం మంటలు పుట్టిస్తోంది. పంట కాలువ రోడ్డులో ఉన్న ఓ కాల్ మనీ స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించడం సంచలనం సృష్టించింది.
అది జరిగిన ఒక రోజు లోపునే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది నాయకులు తెర చాటున ఉండి తమ అనుచరుల ద్వారా లీకులు ఇప్పించారనే మాట వినిపిస్తోంది. అందువల్లనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్ పేర్లు తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు.
బుద్ధా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వర రావు చాలా కాలంగా కాల్ మనీ వ్యాపారం చేస్తున్నాడు. ఈ వ్యాపారంలో బుద్దా నాగేశ్వర రావు బలవంతంగా ఆస్తులు రాయించుకునే స్తాయికి వెళ్లాడని, అయితే మహిళలను లొంగదీసుకునే వ్యవహారం మాత్రం లేదని అంటున్నారు. కాల్ మనీ వ్యవహారంలో ఆయనను పోలీసులు అరెస్టు చేయడంతో బుద్దా వెంకన్న మెడకు కూడా ఆ ఉచ్చు పడింది. తన సోదరుడి వ్యాపారంతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు.

కాగా, బోడె ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన బిల్డర్ కూడా. ఆయనకు పోరంకిలో ఓ అతిథి గృహం ఉంది. పార్టీ, ఎమ్మెల్యే కార్యాలయం కూడా అక్కడి నుంచే నడుస్తుంది. కాల్ మనీ రాకెట్లో ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ ఆయనకు రెండేళ్లుగా పరిచయం. మనీ కాల్ స్థావరాలపై దాడులు జరుగుతున్న సమయంలో వారిద్దరు మకావోలో ఉన్నారు. అక్కడి ఫొటోలను ఫేస్బుక్కులో కూడా పోస్టు చేశారు. వెనిగళ్ల శ్రీకాంత్ కారణంగా బోడె ప్రసాద్కు కూడా కాల్ మనీ దందాతో సంబంధాలున్నాయని, శ్రీకాంత్ను రక్షించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగింది.
బోడె ప్రసాద్ విజయవాడకు తిరిగి వచ్చి పోరంకి అతిథి గృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై వచ్చిన ఆరోపణల మీద వివరణ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేసినవారి మీద ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తమపై కత్తి కట్టిన నేత మీద చంద్రబాబుకు కొంత మంది నేతలు ఫిర్యాదు చేశారని కూడా ఉంటున్నారు.
అంతర్గత కుమ్ములాటలు పార్టీ ప్రతిష్టనే దెబ్బ తీసే విధంగా ఉండడంతో చంద్రబాబు తలపట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విభేదాల కారణంగానే కాల్ మనీ వ్యవహారం పార్టీకి, ప్రభుత్వానికి చుట్టుకుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణా జిల్లా నేతలపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications