ఆత్మహత్యలొద్దు.. ప్రయత్నిస్తున్నాం, కాంగ్రెస్ చేస్తే సులువయ్యేది: సీతారామన్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం న్యూఢిల్లీలో చెప్పారు. ప్రత్యేక హోదా విషయమై ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక హోదా కోసం అందరం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం ఆనాడు కాంగ్రెస్ పార్టీ బిల్లులో ఎందుకు చేర్చలేదో చెప్పాలని నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులో కొన్ని ఆర్థిక ఇబ్బందులున్నాయని ఆమె చెప్పారు.
కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరిలతో కలిసి విభజన చట్టంలోని హామీల అమలుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో కాంగ్రెస్ పెట్టి ఉంటే ఇప్పుడు అది సులువయ్యేదన్నారు.
విభజన చట్టంలోని హామీల అమలు ఆలస్యం కావడం నిజమేనని చెప్పారు. అయితే, హామీలను తాము తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసమే భూసేకరణ చట్టం పైన సవరణలను ప్రతిపాదించామని చెప్పారు. నీతి అయోగ్ సమావేశంలో కాంగ్రెస్ సిఎంలు రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు.