ప్రత్యేక హోదాపై కదలిక - కేంద్ర హోం శాఖ కీలక భేటీ : జగన్ కు పొలిటికల్ రిలీఫ్..!!
కేంద్రంలో కదలిక వచ్చింది. తెలుగు రాష్ట్రాల సమస్యలు - డిమాండ్ల పైన చర్చలకు నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పైన కేంద్రం దృష్టి పెట్టింది. అందులో భాగంగా కీలక సమావేశానికి ముహూర్తం ఖరారు చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చింది. రెండు రాష్టాలకు చెందిన ఎంపీలు తాజాగా పార్లమెంట్ సమావేశాల్లోనూ విభజన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్రం పైన ఒత్తిడి తెచ్చారు. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులోనూ ఏపీ సీఎం జగన్ విభజన అంశాలను పరిష్కరించాలని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చల కోసం కేంద్రం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.
కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో
అందులో హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ తో పాటూ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ నుంచి మరొకరు సభ్యులుగా ఉన్నారు. దీంతో..ఈ నెల 17వ తేదీన ఈ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అజెండా సైతం సిద్దం చేసారు. ఏపీ నుంచి ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్.. తెలంగాణ నుంచి రామకృష్ణారావు కమిటీ సభ్యులుగా ఉన్నారు.
వర్చ్యువల్ గా జరిగే ఈ సమావేశానికి సంబంధించిన అజెండాను రెండు రాష్ట్రాలకు సర్క్యులేట్ చేసారు. అయితే, ఈ సమావేశం లో మొత్తం తొమ్మది అంశాలు అజెండాలో చేర్చారు. స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన, ఏపీ - తెలంగాణ విద్యుత్ వినియోగం, బ్యాంకు డిపాజట్ల వ్యవహారం, వెనుక బడిన జిల్లాల డెవలప్ మెంట్ ఫండ్, రెవిన్యూ లోటు భర్తీ, పన్ను ప్రోత్సహాకాల పైన చర్చించనున్నారు.
అజెండాలో ప్రత్యేక హోదా అంశం
అయితే, వీటితో పాటుగా ప్రత్యేక హోదా అంశాన్ని అజెండాలో చేర్చారు. 2014 లో ఏపీ విభజన సమయంలో పార్లమెంట్ లో రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధానం మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెబుతూ వచ్చింది. ఇక, ఇప్పుడు విభజన చట్టం హామీల అమలు పైన సమీక్షలో భాగంగా హోదా అంశం చేర్చటం ద్వారా కేంద్రంలో కదలిక వచ్చిందా అనే చర్చ మొదలైంది.
2019 ఎన్నికల సమయంలో సైతం సీఎం జగన్ నాడు..తనకు 25 లోక్ సభ సభ్యులను గెలిపిస్తే హోదా సాధిస్తామని చెప్పుకొచ్చారు. అయితే, 2019 ఎన్నికల ఫలితాల్లో 22 లోక్ సభ స్థానాలు వైసీపీ గెలిచింది. కేంద్రంలో బీజేపీకి 2014 కంటే ఎక్కువ సీట్లు సాధించింది. దీంతో..తాము హోదా ఇవ్వాలని అడగుతూనే ఉంటామని సీఎం జగన్ పదే పదే చెప్పుకొచ్చారు.
కేంద్రం ఆలోచనలో మార్పు వస్తోందా
అయితే, ఇప్పటి వరకూ ఏపీకి హోదా పైన స్పందించని కేంద్రం..ఇప్పుడు చర్చల అజెండాలో హోదా అంశం చేర్చటం రాజకీయంగా సీఎం జగన్ కు భారీగా రిలీఫ్ ఇచ్చే అంశంగా చర్చ సాగుతోంది. దీని పైన పలు ప్రధాని తో..కేంద్ర హోం మంత్రి..నీతి అయోగ్ సమావేశాల్లోనూ సీఎం జగన్ ప్రత్యేక హోదా డిమాండ్ ను ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ గట్టిగా చెబుతున్నారు. ఇప్పుడు, కేంద్ర హోం శాఖ చర్చల్లో హోదా అంశం చేర్చటం ద్వారా..ఏపీ మరింత బలంగా కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే డిమాండ్ తో తమ వాదన వినిపించేందుకు సిద్దం అవుతోంది.
Recommended Video
రాజకీయంగా జగన్ కు మేలు చేసేనా..
ఇప్పుడు తిరిగి ప్రత్యేక హోదా అంశం ఈ సమావేశంలోనూ.. అటు రాజకీయంగానూ తిరిగి హాట్ టాపిక్ గా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం పైన కేంద్రం మనసు మార్చుకుంటుందా లేక, చర్చలకే పరిమితం చేస్తారా అనేది 17న జరిగే సమావేశంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీని పైన కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వస్తే..ఖచ్చితంగా అది రాజకీయంగా ఏపీలో కొత్త సమీకరణాలకు..ప్రధానంగా సీఎం జగన్ భారీ రిలీఫ్ ఇచ్చే అంశంగా మారనుంది.