క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటే - టీడీపీలో ఆ కమిటీయే ఫైనల్ : చంద్రబాబు నిర్ణయం..!!
రానున్న ఎన్నికల కోసం పక్కా ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తున్న చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు..నియోజకవర్గంలోని వర్గాల విషయంలో ఇప్పటి వరకు హెచ్చరికలు చేసిన ఆయన..ఇక, వారి విషయంలో కఠినంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. రానున్న ఎన్నికలు టీడీపీకి..వ్యక్తిగతంగా చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఇప్పటికే జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. అక్టోబర్ లో నారా లోకేష్ సైతం ప్రజల ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పూర్తిగా ప్రజల్లోనే ఉండనున్నారు. దీంతో..పార్టీ వ్యవహారాలు..క్రమశిక్షణ ధిక్కరించిన వారి పైన ఇక చర్యలు తీసుకొనే అధికారం సీనియర్లకు అప్పగించారు. ఇందు కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసారు. నేతల మధ్య విభేదాలు, సమన్వయలోపం వంటి సమస్యలు పరిష్కరించేలా కమిటీకి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. కమిటీలో సభ్యులు పార్టీ కేంద్ర కార్యాలయం లో సమావేశమయ్యారు. ఏ నియోజకవర్గంలో ఎక్కడా సమస్యలు ఉన్నాయి.. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారెవరు... సమస్యల పరిష్కారం పైన చర్చించారు.
Recommended Video
పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా కమిటీలో సభ్యులుగా ఉన్న బచ్చుల అర్జునుడు, యనమల రామకృష్ణుడు, టి.డి.జనార్దన్, దామచర్ల సత్య ఈ సమావేశంలో అనేక అంశాల పైన చర్చలు చేసారు. ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినా పని తీరు మార్చుకోని.. పార్టీలో సమస్యలు క్రియేట్ చేసే వారి విషయం లో కఠినంగా వ్యవహరించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో..ఈ కమిటీ తరచూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. కమిటీ తమ నివేదికలను పార్టీ అధినేతకు అందించనుంది.