జయం మనదే..మన లెక్క పక్కా : అమరావతికి తరలి రండి : టిడిపి అభ్యర్దులతో బాబు స్పెషల్ మీట్..
ఇప్పటి వరకు తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు..ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళి పైన దృష్టి సారించారు. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా పోలింగ్ సరళి గురించి సమాచారం సేకరించిన చంద్రబాబు..ఇక, నేరుగా ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్దులతో సమీక్షకు సిద్దమయ్యారు. గెలుపు ఖాయమని చెబుతూనే..అమరావతికి తరలి రండి అంటూ పిలుపునిచ్చారు..
మన గెలుపు ఖాయం...
టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలి కాన్పిరెన్స్ నిర్వహించారు. అందులో ఎన్నికల సరళి గురించి ప్రస్తావించారు. తాను చేయించిన పోస్ట్ పోల్ సర్వేల గురించి వివరించారు. ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని వివరించారు. మహిళలు...వృద్దులు పెద్ద ఎత్తున టిడిపికి ఓట్లు వేసారని విశ్లేషించారు. ఖచ్చితంగా 120 సీట్లు గెలుస్తామంటూ పార్టీ నేతలకు చెప్పుకొచ్చారు. ఐవిఆర్యస్, సర్వే సంస్థలు, పోలింగ్ సరళి పైన పూర్తి సమాచారం సేకరించామని ఖచ్చితంగా టిడిపి అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేసారు. అర్బన్ ప్రాంతంలో టిడిపిని ఒంటరి చేసి కుట్రలు చేస్తున్నారనే సెంటిమెంట్ బలంగా ప్రజల్లో ఉందని విశ్లేషించారు. వైసిపి మైండ్గేమ్ ఆడుతోందని..వైసిపికి ఎందుకు ఓటు వేస్తారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తాను పోటీ చేసిన పీలేరు నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ఇష్టానుసారం వ్యవహరించిందని ఫిర్యాదు చేసారు.

22న అమరావతికి రండి..
టిడిపి నుండి ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ..ఎమ్మెల్యే అభ్యర్దులు ఈ నెల 22న అమరావతికి రావాలని టీడీపి అధినేత చంద్రబాబు ఆదేశించారు. 175 మంది అసెంబ్లీ అభ్యర్దులు..25 మంది లోక్సభ అభ్యర్దులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అందరూ రావాలని సూచించారు. తాను ఈ నెల 23వ తేదీ నుండి ఎన్నికలు జరుగుతున్న ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్తున్నట్లు చంద్రబాబు వివరించారు. పలు నియోజవర్గాల్లో ఎన్నికల సంఘం నిర్లక్ష్యం గా వ్యవహరించిందని పలువురు టిడిపి నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొస్తున్నారు. అయితే, ఈ సమావేశంలో చంద్రబాబు ఎన్నికల సంఘం పై పోరాటానికి ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తారా అనే చర్చ సాగుతోంది. అయితే, పార్టీ అభ్యర్దులకు తమ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి పైన తన వద్ద ఉన్న నివేదికల పైన అభ్యర్దులతో చంద్రబాబు చర్చిస్తారని..వారి విజయావకాశాలను వివరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications