వైసీపీ గూండాలకు పోలింగ్ కేంద్రాల్లో ఏం పని .. దొంగ ఓట్ల వెనుక ఆ ఎమ్మెల్యే సోదరుడు : చంద్రబాబు ఫిర్యాదు
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈరోజు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుని తమ తుది తీర్పును ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఎన్నికల పోలింగ్ సమయంలో జరుగుతున్న ఘటనలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి భయపడకుండా ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓట్లు వేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
మున్సిపోల్స్ : నంద్యాలలో బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కుపుడకలు , నెల్లూరులో ఓటుకు నోటు
విజయవాడ 8 వ డివిజన్ లో టీడీపీ నేతలపై వైసీపీ నేతల దాడిపై చంద్రబాబు ఫైర్
వైసీపీ నేతలు ఓడిపోతామనే భయంతో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై దాడులు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు . ఓటింగ్లో పాల్గొనకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు , విజయవాడ, విశాఖపట్నం ,తిరుపతి లలో వైసిపి నాయకులు ఓటర్లను భయపెడుతున్నారని విమర్శించారు. విజయవాడ 8 వ డివిజన్ అభ్యర్థి కొత్తపల్లి రజిని భర్త కొత్తపల్లి రాజశేఖర్, అలాగే టీడీపీ నేత గోగినేని శ్రీధర్ ల పై వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు .
ఆళ్లగడ్డ నాలుగో వార్డు పోలింగ్ పై చంద్రబాబు అభ్యంతరం , దొంగ ఓట్లపై బాబు ఫైర్
అంతేకాదు ఆళ్లగడ్డ మున్సిపాలిటీ లోని అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ లో నాలుగో వార్డు అభ్యర్థిగా బరిలోకి దిగిన వైసిపి నాయకుడికి, పోలింగ్ కేంద్రంలో ఆయన కాలేజీ సిబ్బందిని రిటర్నింగ్ అధికారులుగా నియమించారని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. తిరుపతి 18 వ డివిజన్ లో దొంగ ఓట్లు వేయించడం కోసం వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేయించేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి సోదరుడు స్థానికేతరులను తీసుకు వచ్చి స్థానిక ఓటర్లను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
వైసీపీ గుండాలకు పోలింగ్ కేంద్రాల్లో ఏం పని ?
పోలింగ్ కేంద్రాల్లో అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలు అరాచకాలు సృష్టిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలలో వైసిపి దారుణాలకు పాల్పడడం అత్యంత హేయమని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ గుండాలకు పోలింగ్ కేంద్రాల్లో ఏం పని ? అని ప్రశ్నించిన చంద్రబాబు దీనిపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ పాలన పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకత భయంతోనే ఎన్నికలను హైజాక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
వైసిపి అక్రమాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి
పంచాయతీ ఎన్నికలలో ఫిర్యాదులు చేసినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని పేర్కొన్న చంద్రబాబు, మున్సిపల్ ఎన్నికల అక్రమాలపై అయినా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. వైసిపి అక్రమాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. టీడీపీ చేతిలో వైసిపి ఓటమి పాలు అవుతుందని ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు ఎన్నికల్లో వైసీపీ నేతల దాడులు , దౌర్జన్యాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .