ఇబ్బంది పెట్టడమే కెసిఆర్ పని: చంద్రబాబు, జగన్పైనా ఫైర్
చిత్తూరు: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే కెసిఆర్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో రేణిగుంట మండలం ఆర్ మల్లవరంలో బుధవారం జరిగిన ‘జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పనికి కెసిఆర్ అడ్డుగా పుల్లలు వేస్తున్నాడని ధ్వజమెత్తారు. తాము కలిసి పని చేసేందుకు ఎంతో ప్రయత్నించామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపైనా చంద్రబాబు ఈ సందర్భంగా మండిపడ్డారు.
కోర్టుల చుట్టూ తిరిగే జగన్మోహన్ రెడ్డికి తనను విమర్శించే హక్కు లేదని అన్నారు. జగన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమకు నీరు తెచ్చే వరకు విశ్రమించేది లేదని చంద్రబాబు అన్నారు. హంద్రీనీవాతో మదనపల్లి, పుంగనూరులకు నీరు అందిస్తామని చెప్పారు. నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. తమను కట్టుబట్టలతో పంపించారని అన్నారు. రాష్ట్రాన్ని ఇష్టానుసారం విభజించి ఏపి పొట్టకొట్టారని మండిపడ్డారు. ఎన్నో ఇబ్బందులున్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నానని చెప్పారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు, అన్ని వర్గాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామని చంద్రబాబు చెప్పారు. ఏడాదిలోనే రూ. 40వేల కోట్లు పేదల కోసం కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. పేదల పింఛన్లు ఐదు రెట్లు పెంచామని, రైతులకు రూ.24వేల కోట్లు, డ్వాక్రా సంఘాలకు రూ.10కోట్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు.
ప్రభుత్వ పథకాల అమలులో అధికారులకు అలసత్వం తగదని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పనులు జరగకపోతే ఎన్ని జన్మభూమి కార్యక్రమాలు పెట్టినా ఉపయోగం ఉండదన్నారు. జన్మభూమికి మళ్లీ వచ్చే జన్మభూమికి మార్పు కనపడాలన్నారు. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు.
డ్వాక్రా సంఘాల వద్ద రూ.15వేల కోట్లు ఉన్నాయని, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 9లక్షల డ్వాక్రా మహిళా సంఘాలు ఇక్కడ ఉన్నాయన్నారు. నవ నిర్మాణ దీక్షలో లక్షల మంది ప్రజలు పాల్గొన్నారని తెలిపారు.