బాబు వద్ద బ్లూఫ్రింట్ సిద్ధం, నేను మాత్రం: జగన్ ట్వీట్, కేసీఆర్పై రేవంత్
కరీంనగర్/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మరోసారి ట్విట్టర్లో స్పందించారు. చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ డ్రీమ్స్ తీర్చుకునేందుకు బ్లూఫ్రింట్ సిద్ధం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు.
అయితే, ఆ బ్లూ ప్రింటులో లక్షలాది మంది ప్రజల కలలను సమాధి చేస్తుండటాన్ని తాను చూస్తున్నానని విమర్శించారు. కాగా, వైయస్ జగన్.. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక తదితర ప్రాంతాలలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
టీడీపీ అధికారంలోకి వస్తే అమరవీరులకు స్తూపం: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ట్యాంకు బండ్ పైన అమరవీరులకు స్థూపం కట్టిస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి మంగళవారం కరీంనగర్ జిల్లాలో అన్నారు. జిల్లాలోని తిమ్మాపూర్ సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో ప్రజలకు భరోసా కల్పించేందుకే పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వచ్చారని చెప్పారు. తెలంగాణలో 1200 మంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారని, వారి వల్లే రాష్ట్రం ఏర్పడిందన్నారు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెళ్లట్లేదని ఆరోపించారు.
అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదని చెప్పారు. ఇప్పటికీ అమరవీరుల జాబితా కూడా ప్రభుత్వం వద్ద లేదని మండిపడ్డారు. వారికోసం ప్రభుత్వం కనీసం ఒక స్తూపం కూడా నిర్మించలేదన్నారు. రైతుల రక్తంలోంచి పుట్టిన పార్టీ తెదేపా అని రేవంత్ పేర్కొన్నారు.