నా పరిస్థితే ఇలా ఉంటే, నా జీవితంలో చూల్లేదు: 'నోట్ల రద్దు'పై బాబు అసహనం
పెద్ద నోట్ల రద్దు పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు.
అమరావతి: పెద్ద నోట్ల రద్దు పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రూ.500, రూ.1000 నోట్లు రద్దయి ఇన్ని రోజులు అయినా ప్రజల ఇబ్బందులు తగ్గక పోవడం ఏమిటని, ఇన్నేళ్ల తన జీవితంలో ఇలాంటి పరిస్థితి తొలిసారి చూస్తున్నానన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న తనకే ఇబ్బందులు కనిపిస్తున్నాయని, తనకే ఇంత అసహనం ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటిని అన్నారు. ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలన్నారు. నోట్ల సమస్యతో నిరుపేదల నుంచి ధనికుల వరకు అందరూ ఇబ్బంది పడుతున్నారన్నారు.
పన్నెండు రోజులైనా పెద్దనోట్ల సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. ఒక సమస్య ఇన్నాళ్లు అపరిష్కృతంగా ఉండటం తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.

నోట్ల మార్పిడిలో ప్రజల ఇబ్బందులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కలెక్టర్లు, ఆర్బీఐ, ఎస్ఎల్బీసీ, ఆర్థిక శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులకు బ్యాంకర్లు, అధికారులు తక్షణమే ఉపశమనం కల్పించాలని ఆదేశించారు.
సంక్షోభ సమయంలో పరస్పర సహకారం, సమర్థ కార్యాచరణ ప్రధానమన్నారు. అన్ని బ్యాంకుల్లోనూ ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చిన రూ.2వేల కోట్లలో వంద నోట్లు రూ.400 కోట్లు ఉన్నాయన్నారు.
జన్ధన్ ఖాతాలు, రూపే కార్డులను వెంటనే క్రియాశీలకం చేయాలని, ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదు రహితంగా జరపాలన్నారు. అన్ని బ్యాంకులు సమన్వయంతో పని చేయాలని, ప్రభుత్వ ఆదేశాలు పాటించని బ్యాంకర్లకు నోటీసులు జారీచేస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చేసే బాధ్యత పోలీసు శాఖదే అన్నారు.












Click it and Unblock the Notifications