బాబుకు మానసిక సమస్య ఉందన్న విజయసాయి ఆ పేరు చెప్పారు, ఈ రోగం ఉన్నవారికి చికిత్స ఇదే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఏదో మానసిక సమస్య ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా, ఆయన ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. చంద్రబాబుకు మానసిక సమస్య ఉందంటూ, అదేమిటో కూడా చెప్పారు.
అన్నయ్య, నేను ఏం పీకుతారన్నారు, ఎవరు ఎవరితోనో ఉన్నారనేది న్యూసా?: పవన్ కళ్యాణ్
ఈ మేరకు రెండు రోజుల క్రితం ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చంద్రబాబుకు అబద్దాలు చెప్పే రోగం ఉందని చెబుతూ రెండు నిమిషాలకు పైగా ఉన్న వీడియోను పోస్టు చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా పాత్ర కూడా ఉంది.
సోషల్ మీడియాపై దృష్టి
చాలాకాలంగా ఏపీలో టీడీపీ, జాతీయస్థాయిలో కాంగ్రెస్ కూడా దీనిపై దృష్టి సారించింది. ఇటీవలి కాలంలో వైసీపీ కూడా సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకుంటోంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి వంటి వారు వరుసగా పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాతో పాటు సోషల్ మీడియాను కూడా సాధ్యమైనంత వినియోగించుకునే పనిలో వైసీపీ పడింది. అందుకే విజయసాయి వరుసగా పోస్టులు పెడుతున్నారు.
భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు
తాజాగా, ఆయన పోస్ట్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిని చాలామంది చూస్తున్నారు. ఈ వీడియోకు చాలామంది అనుకూలంగా, వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు భయం మానసిక వ్యాధిగ్రస్తుడు అని ఓ నెటిజన్ టీడీపీ అదినేతకు వ్యతిరేకంగా కామెంట్ పెడితే, మరో నెటిజన్ మిస్టర్ ఏ2 నీవు సత్యహరిశ్చంద్రుడివా అని విజయసాయికే కౌంటర్ ఇచ్చారు. ఇలా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
లక్షమందిలో ఒకరికి ఈ రోగం
ఈ మేరకు వీడియోలో విజయసాయి మాట్లాడుతూ... చంద్రబాబు ఎందుకు నోరు తెరిస్తే అబద్దాల వర్షం కురిపిస్తారో సైకాలజిస్టులు గుర్తించారని, రోగ నిర్ధారణ కూడా చేశారని, జన్యువుల్లోనే ఉండే ఈ అసహజ రుగ్మత వల్ల నిరంతరం కట్టుకథలు అల్లుతూ, అసత్యాలే నిజమని నమ్మించే ప్రయత్నాలను ఈ వ్యాధిగ్రస్తులు చేస్తారట అని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఉన్న ఈ మానసిక వైకల్యాన్ని పాథలాజికల్ లయింగ్ అని పిలుస్తారని ఎద్దేవా చేశారు. లక్షమందిలో ఒకరికి ఈ రుగ్మత ఉంటుందని, దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నించి కొంతమంది సక్సెస్ అయ్యారని, కానీ అబద్దాలకు రంగులు అద్ది నమ్మించేలా చేయడం, సులువు అని గ్రహించిన చంద్రబాబు దీనిని జీవన విధానంగా, జీవన సరళిగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.
ఈ రోగానికి సైంటిస్టులు పెట్టిన పేరు ఇదే
పాథలాజికల్ లయింగ్కు పలుపేర్లు ఉన్నాయని, దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు స్యూడో లాడియా ఫెండాస్టికా అని విజయసాయి ఎద్దేవా చేశారు. దీనిని అనుకూలంగా మలుచుకున్న వ్యక్తులు, తాము రాసుకునే డైరీల్లో, ఆత్మకథలలో కూడా నిజం చెప్పరని తెలిపారు. తమను తాము ఉన్నత వ్యక్తులుగా, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారిగా, సమాజంలో పరివర్తన కోసం తపిస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంటారని తెలిపారు. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, తనతో పనిచేసే వారికి ఎవరికీ నిజం చెప్పరన్నారు. వీరి అసత్యాలు నమ్మశక్యంగా ఉండవన్నారు.
ఈ రోగం ఉన్న వారికి చికిత్స ఏమంటే?
ఒక విషయాన్ని చెప్పినప్పుడల్లా మరికొన్ని అబద్దాలు చెబుతారని, తుఫాను ప్రభావం తగ్గించానని, సముద్రాన్ని కంట్రోల్ చేశానని, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని, రైతులకు నోబెల్ ప్రైజ్ వస్తా నూరు కోట్ల నజరానా ఇస్తామని చెప్పడం, సెల్ ఫోన్లు కనిపెట్టింది తానేనని, ఐటీని పాపులర్ చేసింది తానేనని, సాఫ్టువేర్ ఇంజినీర్లను అమెరికాకు పంపించింది తానే అని.. ఇలా కథలు కథలుగా అల్లడం సైకలాజికల్, పాథలాజికల్, బయోలాజికల్ లయింగ్ ప్రభావం అన్నారు. దీనికి చికిత్స ఒక్కటేనని, ప్రజలు వీరిని చిత్తుగా ఓడించి, మీరు రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనర్హులు అని చెప్పి, ఇంటికి పరిమితం చేయాలని, ఇదే వీరి రోగ నివారణ అన్నారు.