తెలంగాణకు నేను నో అన్లేదు కానీ, మేమే చేశాం: బాబు, కేసీఆర్కు సూచన
కరీంనగర్: తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు తెరాసకు లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ సభలో అన్నారు. తాను తెలంగాణకు నో చెప్పలేదని, విభజన వల్ల సమస్యలు వస్తాయని, పరిష్కారం చేయమని మాత్రమే చెప్పానని తెలిపారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడింది టీడీపీయే అన్నారు. టీడీపీకి మంచి కార్యకర్తలు ఉన్నారన్నారు.
టీడీపీ పాలన వల్లనే తెలంగాణలో మిగులు బడ్జెట్ వచ్చిందని, బాబ్లీ ప్రాజెక్టు పైన తామే పోరాడామని, దెబ్బలు తిని జైలుకు వెళ్లామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చింది తామే అన్నారు. తెలంగాణలో ఎక్కువ సాగునీరు ఇచ్చింది టీడీపీయేనని చెప్పారు. తెలంగాణలో రాజకీయ చైతన్యం తీసుకు వచ్చింది తామే అన్నారు. మాదిగలకు రాజకీయ గుర్తింపు టీడీపియే తెచ్చిందని, వారికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం టీడీపీ వల్లే సాధ్యమైందన్నారు. పేదవారి కోసం టీడీపీ కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజల పైన తనకు చాలా నమ్మకం ఉందని చెప్పారు. సర్వమత సమ్మేళనానికి పుట్టినిల్లు కరీంనగర్ అని చెప్పారు. దివంగత ప్రధాని పీవీ నర్సింహా రావు వంటి వారు పుట్టిన నేల కరీంనగర్ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే టీడీపీ పుట్టుకు వచ్చిందని, దాని కోసమే పోరాడుతుందని చెప్పారు.

తెలంగాణలో టీడీపీని నాయకులే వీడారు తప్ప కార్యకర్తలు కాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 54 శాతం, ఆంధ్రప్రదేశ్కు 46 శాతం కరెంట్ ఇవ్వాలని బిల్లులో తీసుకువచ్చారని చంద్రబాబు చెప్పారు. దీంతో ముందు చూపుతోనే ఆంధ్రప్రదేశ్ కోసం విద్యుత్ను కొనుగోలు చేసుకున్నామన్నారు. నిధులు లేకపోయినా యూనిట్ రూ. 6ల చొప్పున కొనుగోలు చేశామన్నారు.
ప్రజలకు మంచి చేస్తే తెరాసకు సహకరించడానికి టీడీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఇరు రాష్ట్రాల సమస్యలు చర్చలతో తేల్చుకోవచ్చునని చెప్పారు. భవిష్యత్తో ఒక్కసారి కూర్చుని, కరెంట్ విషయమే కాదు అన్ని సమస్యలపై కూర్చుని మాట్లాడుకుందామని, రెండు మూడేళ్లు ఇబ్బందులు ఉంటాయని, ఏపీలో కూడా ఇబ్బందులు ఉంటాయని, ఒకరికొకరు సహకరించుకుందామని తెలంగాణ సీఎం కేసీఆర్కు సూచించారు.
రాజకీయం వేరు, ప్రభుత్వాలు వేరన్నారు. ప్రభుత్వపరంగా మనం సహకరించుకుందామని, పార్టీ పరంగా ఎవరి పని వారు చేసుకుంటారని, తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలు బాగుండాలని కోరుకుంటున్నానని, అభివృద్ధిలో ముందుకు పోవాలని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు రావాలన్నారు. తెలంగాణలో భవిష్యత్తు టీడీపీదే అన్నారు.












Click it and Unblock the Notifications