జగన్, కెసిఆర్లను దులిపేసిన బాబు: 35సీట్లలో గెలుపు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల పైన నిప్పులు చెరిగారు. కెసిఆర్ పగడి వేషగాడని, మారీచుడిని మించిపోయాడని మండిపడ్డారు.
అప్పనంగా తెలంగాణ దొరికిందని, దానిని తినేద్దామని చూస్తున్నాడని విమర్శించారు. జగన్ కొత్త బిచ్చగాడన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లో కలిసి 35 లోకసభ సీట్లను టిడిపి గెలుస్తుందన్నారు. కేంద్రంలో తమ పార్టీ చక్రం తిప్పుతుందన్నారు.
హైదరాబాద్ తన వల్లనే అభివృద్ధి చెందిందని చంద్రబాబు అన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోను తాము అధికారంలోకి వచ్చాక అలాంటి నగరాలను తయారు చేస్తామన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందన్నారు. కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ భూ స్థాపితమైపోయిందని మండిపడ్డారు.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని బాబు చెప్పారు. టిడిపితోనే సీమాంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఖాయమన్నారు. తోట త్రిమూర్తులు బుధవారం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.