కలిసిపోదామని కెసిఆర్కి బాబు: వెక్కిరించినా.. నిలబడ్డా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడు ముగింపు సభలో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హితవు పలికారు. తెరాస రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడుతోందని అది సరికాదన్నారు. మనం విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉందామన్నారు. మన మధ్య విభేదాలు వద్దని సూచించారు. విడిపోయినా కలిసి ముందుకు సాగుతామని చెప్పారు.
అభివృద్ధిలో పోటీ పడదామన్నారు. మన పైకి ఎవరైనా వస్తే రెండు రాష్ట్రాల వాళ్లం కలిసి పోరాడుదామన్నారు. పోలవరం విషయంలో కెసిఆర్ రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. కార్యకర్తలే టిడిపికి అండ అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు.

అందరం కలిసి తెలుగు జాతిని ఉన్నత శిఖరాల పైన నిలబెడదామన్నారు. టిడిపి ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ఆరేడు రాష్ట్రాలలో పోటీ చేసి జాతీయ పార్టీగా అవతరిస్తుందని చెప్పారు. కార్యకర్తల సంక్షేమానికి రూ.20 కోట్లు వచ్చాయని తెలిపారు. తాను కార్యకర్తల రుణం తీర్చుకుంటానని చెప్పారు.
సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం పోరాడిన వారి పైన, తెలంగాణలో తెలంగాణ కోసం పోరాడిన వారిపైన కేసులు ఎత్తివేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం విషయంలో రాద్దాంతం చేయవద్దన్నారు. తెలంగాణ అమరవీరులను ఆదుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఇక నుండి మహానాడు ఎక్కడ నిర్వహించినా అన్ని ప్రాంతాల వారికి ఆహ్వానం అందుతుందని చెప్పారు. తెలంగాణలో టిడిపి అధికారంలోకి వచ్చే వరకు అండగా ఉంటానని చెప్పారు.
చంద్రబాబు మహానాడు వేదికగా తెలంగాణ టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిల పేర్లను ప్రస్తావించారు. ఎర్రబెల్లి మహానాడులో ఎన్నో విషయాలు చెప్పారని, మోత్కుపల్లి తెలంగాణలో ఒంటరి పోరు చేశారని, రేవంత్ టిడిపిన విశ్వవిద్యాలయంగా చెప్పారని కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తాము ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యకర్తల కోసం చాలామంది విరాళాలు ఇచ్చారని చెప్పారు.
పార్టీ కోసం పని చేసిన వారిని తాము తప్పకుండా గుర్తు పెట్టుకుంటామని చెప్పారు. ఇరు రాష్ట్రాల వాళ్లం కేంద్రంపై పోరాడి అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రజలకు మెరుగైన పాలన ఇద్దామని, అభివృద్ధిలో పోటీ పడదామని తెరాసకు హితవు పలికారు. నేతలు పార్టీని వీడినా కార్యకర్తలు వెళ్లలేదన్నారు. తెలంగాణలో టిడిపిని అధికారంలోకి తీసుకు వస్తానని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసమే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నానని చెప్పారు.
ఎపి రాజధాని నిర్మాణం కోసం మహానాడులో 1.40 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయన్నారు. ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని కోరారు. విభజన విషయంలో తాను ఢిల్లీలో అనేక అవమానాలకు గురయ్యానని చెప్పారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం అని తాను చెబితే ఎగతాళి చేశారన్నారు. తెలంగాణ కావాలో ఆంధ్రా కావాలో తేల్చుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. టిడిపి పైన కుట్ర చేశారన్నారు. కుట్ర చేసిన పార్టీ కాలగర్భంలో కలిసిందన్నారు. టిడిపిని దెబ్బతీసేందుకు అనేక కుట్రలు చేసినా వాటిని తట్టుకొని నిలబడ్డానన్నారు.












Click it and Unblock the Notifications