టిడిపి చెప్పింది.. ఢిల్లీలో కదలిక, సాయంచేయండి: బాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మహానాడులో మాట్లాడారు. మహానాడు తొలి రోజు తెలుగుదేశం పార్టీ అవినీతిరహిత భారత దేశం కోసం తీర్మానం చేసిన రోజునే.. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించిందని చంద్రబాబు అన్నారు. నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.
టిడిపి కార్యకర్తలను పార్టీ ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పారు. కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తమ తమ సంపాదనలో కొంత ఇవ్వాలని చెప్పారు. కార్యకర్తల కోసం అందరూ సాయం చేయాలన్నారు. విరాళం ఇచ్చిన వారికి తాను పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. తాను అందరి రుణం తీర్చుకుంటానని చెప్పారు.

టిడిపిని ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూశారని కానీ, అలాంటి సందర్భాల్లో వారే మునిగిపోయారన్నారు. మహానాడు కార్యక్రమాన్ని ఎన్టీఆర్ పుట్టిన రోజునే చేయడాన్ని పలుమార్లు ఎందరో ప్రశ్నించారని, కానీ మనం అదే రోజు చేయాలని గట్టిగా నిర్ణయానికి వచ్చామన్నారు. మహానాడు ఎప్పుడు ఆయన జయంతి రోజునే ఉంటుందన్నారు. ఎన్టీఆర్ తన ప్రజాహిత కార్యకర్మాల వల్ల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
ఎన్టీఆర్కు భారతరత్న తెలుగువారందరి ఆకాంక్ష అన్నారు. ప్రస్తుతం మనం కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నామని, ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే వరకు తాము కృషి చేస్తామన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నామని, దానికి అందరూ ఆమోదించాలన్నారు. టిడిపి తన ఏ కార్యక్రమాన్ని కూడా ఎన్టీఆర్ లేకుండా చేయదన్నారు.












Click it and Unblock the Notifications