హుటాహుటిన ఢిల్లీకి చంద్రబాబు: ఆ హోదాలో ఏపీకి రాక?
Chandrababu Naidu: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది.. పట్టుమని 10 స్థానాలే.
అటు లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఇవే ఫలితాలు కనిపించాయి. కంచుకోటల్లాంటి నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. విశాఖపట్నం- 2, చిత్తూరు-2, కడప- 3, కర్నూలు- 2, ప్రకాశం- 1.. ఇవీ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య.

2014 నాటి ఎన్నికల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవి చూసింది వైఎస్ఆర్సీపీ. ఆ ఎన్నికల్లో 151 సీట్లతో జయకేతనాన్ని ఎగురవేసిన ఇప్పుడు పట్టుమని పది సీట్లకు మాత్రమే పరిమితం కావడం ఆ పార్టీ దీనస్థితికి అద్దం పట్టినట్టయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం 23 సీట్లయినా లభించాయి.
అయిదు సంవత్సరాలు తిరిగే సరికి వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారడం ఓటర్లల్లో ఆ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఓటమిని వైఎస్ జగన్ అంగీకరించారు. కొద్దిసేపటి కిందటే ఆయన విలేకరులతో మాట్లాడారు. పోరాటం తమకు కొత్త కాదని, ప్రజల తరఫున పోరాడుతామని పేర్కొన్నారు.
అటు టీడీపీ- జనసేన- బీజేపీకి కలిపి 165 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. టీడీపీ- 136, జనసేన- 21, బీజేపీ- 8 నియోజకవర్గాల్లో జయకేతనాన్ని ఎగురవేశాయి. జనసేన, బీజేపీ.. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఢిల్లీ నుంచి పిలుపు అందింది. బుధవారం ఆయన హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులను కలుసుకోనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకుల సమావేశంలో పాల్గొననున్నారు.
తెలుగుదేశం కోసం అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి బేరసారాలు సాగించడం మొదలుపెట్టేశాయప్పుడే. తమకు మద్దతు ఇస్తే చంద్రబాబు, ఏపీపై వరాలు కురిపిస్తామంటూ హామీలు ఇస్తోన్నాయి. తమకు మద్దతు ఇస్తే ఎన్డీఏ జాతీయ కన్వీనర్గా అపాయింట్ చేస్తామంటూ చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చింది బీజేపీ.












Click it and Unblock the Notifications