ప్రత్యేక హోదా సాధిస్తా: బాబు, నిలదీయండి: ఉండవల్లి
హైదరాబాద్/నెల్లూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. సునామీ కేంద్ర శంకుస్థాపనకు నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలంలోని తూపిలి పాలెం గ్రామానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, హర్షవర్ధన్తో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రాష్ట్ర విభజన అడ్డదిడ్డంగా జరిగిందని, కాంగ్రెస్ వారు చేసిన పాపం మనకు శాపంగా మారిందన్నారు. విభజన సమయంలో ప్రకటించిన ప్రతిదానిని దశల వారీగా సాధించుకొంటూ ప్రత్యేక హోదా కేంద్రం నుండి వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.
హోదాపై ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ప్రత్యేక హోదాపై కేంద్రబానికి టీడీపీ హెచ్చరించాలన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని ఆయన ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'ప్రత్యేక హోదా ఇవ్వకుంటే దూకేస్తా'
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే సెల్ టవర్ మీద నుంచి దూకేస్తానని గుంటూరు జిల్లా మంగళదాస్ నగర్లో సంజీవ రావు అనే యువకుడు హెచ్చరించాడు. ప్రత్యేక హోదా కోసం గంటల తరబడి సెల్ టవర్ మీదే ఉంటున్నాడు. దీంతో అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది. ఎంతమంది వారించినా అతను దిగిరావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే వరకు తాను కిందకు దిగిరానని చెప్పాడు. అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.