ప్రభుత్వంపై బైరెడ్డి అసంతృప్తి, ఆత్మహత్యలపై చంద్రబాబు ఆందోళన
కర్నూలు/విజయవాడ: ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. నిరసన తెలిపే వారిని చంద్రబాబు ప్రభుత్వం హౌస్ అరెస్టు చేస్తోందని విమర్శించారు. 2014 డిఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు, రైతుల ఆత్మహత్యపై చంద్రబాబు ఆందోళన
రాష్ట్రంలోని విద్యార్థులు, రైతుల ఆత్మహత్యల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు.
వాటి నివారణ మార్గాల పైన దృష్టి పెట్టాలన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో రైతు ఆత్మహత్యలపై సమీక్ష నిర్వహించారు. ఆత్మహత్యలకు అప్పులు, అధిక కౌలు, కుటుంబ సమస్యలు కారణమని చంద్రబాబుకు అధికారులు చెప్పారు.

ఆత్మహత్యలపై లోతైన చర్చ జరగాలని చంద్రబాబు చెప్పారు. రైతు కుటుంబాలకు వ్యవసాయ అధికారులు అండగా ఉండాలని ఆదేశించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయాలన్నారు. భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో బోర్లు వేయకుండా చూడాలన్నారు. కేంద్రానికి నివేదిక పంపి నిధులు రాబట్టాలన్నారు.
కాగా, ఏపీలోని ప్రయివేటు విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలపై ప్రభుత్వం శనివారం స్పందించింది. ఇందుకుగల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై అధ్యయనం కోసం విశ్రాంత ఐఎఎస్. అధికారి చక్రపాణి నేతృత్వంలో ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ సంఘంలో సభ్యులుగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి రత్నకుమారితోపాటు మనస్తత్వ నిపుణుడ్ని నియమించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. త్వరలో రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలనూ తెలుసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications