నాదే శిక్షణ, గురువుకే పంగనామాలు: కెసిఆర్పై బాబు

తెలుగుదేశం పార్టీని కాంగ్రెసు, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు లక్ష్యం చేసుకున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు చోట్ల కూడా తామే చక్రం తిప్పుతామని ఆయన చెప్పారు. తమ పార్టీని దెబ్బ తీసి బిసిలపై పెత్తనం చేయవచ్చునని కాంగ్రెసు, తెరాస భావిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తనను సిబిఐ కేసుల్లో ఇరికించాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నించారని, అయితే తాను నిప్పులా బతికాను కాబట్టి ఏమీ చేయలేకపోయారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చేస్తానని ఆయన చెప్పారు. త్వరలో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తానని కూడా ఆయన చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని ఆయన చెప్పారు. సామాజిక తెలంగాణ టిడిపితోనే సాధ్యమని ఆయన అన్నారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారం కూడా తమ పార్టీ ద్వారానే సాధ్యమని అన్నారు. గత ఎన్నికల్లో తెరాసతో పొత్తు పెట్టుకోవడం వల్ల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓడిపోయామని, పొత్తు తెంచుకున్న తర్వాత 45 మంది కార్పోరేటర్లు గెలిచారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం కాంగ్రెసు పార్టీ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని ఆయన అన్నారు. ఈ చర్యతో కాంగ్రెసు డొల్లతనం బయటపడిందని అన్నారు. కాంగ్రెసు పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చినా ఐదేళ్లు కూడా స్థిరమైన పాలన అందించలేకపోయారని ఆయన అన్నారు.
కాంగ్రెసు అరాచక నిర్ణయాలకు సమాజం నష్టపోయిందని, అందరూ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తెలుగుజాతిని నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో భాగంగానే రాష్ట్రపతి పాలన విధిస్తున్నారని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications