ముద్రగడ దీక్షపై బాబు స్థితి: కరవమంటే కప్పకు, వద్దంటే పాముకు...
రాజమండ్రి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేత దీక్షను విరమింపజేయడం ఎలాగో తెలియక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతమవుతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో పోలీసు పహారా మధ్య ముద్రగడ దీక్ష చేస్తు్నారు. ఆయన భార్య, కోడలు ఆరోగ్యం కూడా క్షీణించినట్లు తాజాగా శనివారంనాడు వైద్యులు చెప్పారు.
ముద్రగడ అనుమతితో ఆయన భార్యకు, కోడలికి వైద్య పరీక్షలు చేసినట్లు వైద్యులు చెప్పారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముద్రగడ సహకరించడం లేదని వారు చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. దీక్ష విషయంలో ముద్రగడ పట్టువీడకపోవడం కలవరం రేపుతోంది.

ఒకవైపు ఆమరణ దీక్షను భగ్నంచేసి, ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ఏమిచేయాలో తోచని స్థితిలో పడ్డారు. సిబిసిఐడి రెండు కేసుల్లో దర్యాప్తు పూర్తయిందని చెప్పినా ఆ కేసుల్లో మాత్రం ముద్రగడను అరెస్టు చేయలేదు. కిర్లంపూడి, అమలాపురంల్లో నమోదైన రెండు కేసులను కూడా చూపించలేదు. కేవలం ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంతోనే అదుపులోనికి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.
అరెస్టు చూపిస్తే బెయిల్ తీసుకోరనే ఉద్దేశ్యంతోనే పోలీసులు అరెస్టు చూపించడం లేదు. కొత్త సమస్యలు తెచ్చుకోవడం ఇష్టం లేక ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. మొదటి రెండు రోజులు ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించి ఫలితం సాధించినట్లు కనిపించింది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం వ్యూహం మార్చుకున్నట్టు అర్థమవుతోంది.
మంగళగిరిలో ముద్రగడకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే కాపు సామాజిక సమావేశం జరిగినా పెద్దగా స్పందన రావడం లేదంటున్నారు. ముద్రగడకు అనుకూలంగా విజయవాడలో పోటీ సమావేశం కూడా నిర్వహించారు. కాపు సంఘాల జెఎసి 13 జిల్లాల్లో బంద్కు పిలుపునిచ్చి చేయించింది. ఈ నేపథ్యంలో జగన్ ఆరోపణలకు ప్రభుత్వం స్పందించి సిబిఐ విచారణ అంగీకరిస్తామని చెప్పింది. ప్రభుత్వ ప్రతిపాదన ముద్రగడ తిరస్కరించి, భేషరతుగా అరెస్టుచేసిన వారందర్నీ విడుదల చేయాలనే డిమాండును వదులుకోవడానికి సిద్దంగా లేరు.
ఈ స్థితిలో సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక చంద్రబాబు ప్రభుత్వం సతమవుతున్నట్లు అర్థమవుతోంది. కరవంటే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపం అనే చందంగా వ్యవహారం తయారైందని అంటున్నారు.












Click it and Unblock the Notifications