బీజేపీ ప్రతినిధులకు చంద్రబాబు విందు: సీఎం కుప్పం పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన ఖరారైంది. జూన్ 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటిస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు పర్యటనకు వస్తుండటంతో అటు అధికారులు, ఇటు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఢతలు తెలుపనున్నారు. కాగా, చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వసారి విజయం సాధించడం విశేషం. ఆనాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు.. 1989 నుంచి ఇక్కడ్నుంచి వరుసగా విజయాలు నమోదు చేస్తున్నారు.
బీజేపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు విందు
బీజేపీ ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు తన నివాసంలో గురువారం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తదితరులు సీఎం నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు చంద్రబాబు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.
#AndhraPradesh: @BJP4Andhra president & #Rajahmundry MP @PurandeswariBJP along with newly elected MP @CMRamesh_MP & MLAs @yschowdary and others called on Chief Minister Nara Chandrababu Naidu at his residence in #Undavalli.
— Sistla Dakshina Murthy (@Murthy_BZA) June 20, 2024
Follow us @NewsMeter_In pic.twitter.com/hd2rwPcUZh
ఎన్నికలు జరిగిన తీరు, కలిసికట్టుగా పడిన కష్టం గురించి నేతలు చర్చించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వేధింపులను సుజనా చౌదరి ప్రస్తావించారు. వైసీపీ వేధింపులకు అన్ని వర్గాలూ బాధితులేనని చంద్రబాబు చెప్పారు. అనపర్తిలో ఉపాధి నిధులు జోడించి కాల్వల మరమ్మతులు చేపట్టానని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి చెప్పగా.. నువ్వు ఎక్కడున్నా పని ప్రారంభిస్తావంటూ ఆయనకు చంద్రబాబు కితాబిచ్చారు.
మరోవైపు, మద్యం, ఇసుక మాఫీయాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు. ఇక, బీజేపీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు వినతి పత్రాలు అందించారు. చంద్రబాబు వీటికి సానుకూలంగా స్పందించారు.












Click it and Unblock the Notifications