హోండాపై చీటింగ్ కేసు: బైకుల రవాణా చార్జీల పేరుతో మోసమని ఫిర్యాదు
హైదరాబాద్: షోరూంకు బైకులను డెలివరీ చేయడంలో రవాణా చార్జీల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారంటూ ఓ డీలర్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రముఖ బైక్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్పై, ఆ సంస్థ అధినేత జపాన్కు చెందిన కీతా మురామత్సుతోపాటు మరో 14మందిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి - హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో నివాసం ఉండే డీఎస్పీ రెడ్డి అనే వ్యక్తి విజయవాడలో 2001నుంచి కనకదుర్గ ఆటోమొబైల్స్ పేరుతో హోండా వాహనాల డీలర్గా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ 45 వేల దాకా బైకులను హోండా కంపెనీ నుంచి కొనుగోలు చేసి తన షోరూం ద్వారా విక్రయించాడు.
గోడౌన్ నుంచి డెలివరీ చేసే బైక్లను డీలర్కు వాస్తవిక రవాణా చార్జీలతో అందజేయాల్సిన హోండా సంస్థ ఒక్కో బైక్కు రూ.2068 చొప్పున వసూలు చేసింది. వాస్తవానికి ఒక్కో బైక్పై రూ.1418 మాత్రమే ఖర్చవుతుందని, డీలర్షిప్ ఇచ్చే సమయంలో రవాణా చార్జీలు తప్ప లాభాన్ని తీసుకోమని సంస్థ అగ్రిమెంట్లోని 11.4 నిబంధన స్పష్టం చేసిన నేపథ్యంలో ఇన్నాళ్లూ తనను మోసం చేసిన హోండా సంస్థపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ రెడ్డి మూడో అదనపు మెట్రోపాలిటన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఒక్కో బైక్పై రూ.646 అధికంగా వసూలు చేసి తనను రూ.2.68 కోట్ల మేర కంపెనీ మోసం చేసిందని ఆధారాలు సమర్పించారు. దీన్ని దాచిపెట్టి భారీ మోసానికి పాల్పడుతున్న హోండా మోటర్ సైకిల్స్ సంస్థతోపాటు మేనేజింగ్ డైరెక్టర్ కీతా మురామ త్సు, డైరెక్టర్లు టకనోరీ మరుయమా, యసుటకా యుడా, తోషినోబు మోతాయి, బంజరాహిల్స్ రోడ్ నంబర్ 10లోని హోండా మోటార్ సైకిల్స్ జోనల్ మేనేజర్ రితేష్నాయర్తోపాటు మరో 10మందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
దీన్ని విచారించిన కోర్టు వీరందరిపై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. దీంతో బుధవారం వీరిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 156(3)ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications