అప్పుడే వచ్చి ఉంటే..: చిరంజీవిపై చింతా మోహన్ ఆసక్తికరం
ఏలూరు/ హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిపై కాంగ్రెసు నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే విజయం సాధించేవారని ఆయన అన్నారు.
అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఆయన తీవ్రమైన విమర్శలు చశారు. పోలవరం ప్రాజెక్టు అవినీతి వరంగా మారిపోయిందని ఆయన అన్నారు.
చిరంజీవి అప్పుడే వచ్చి ఉంటే...
రాజకీయాల్లోకి రావాలని చిరంజీవిని తాను అప్పుడే కోరానని, 1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే విజయం సాధించేవారని చింతా మోహన్ అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెసులో దాన్ని విలీనం చేసిన విషయం తెలిసిందే.
మోడీకి మరక అంటింది...
సొమ్మొకడిదీ సోకొకడిది అనే మాదిరిగా పోలవరం ప్రాజెక్టును మార్చేశారని చింతా మోహన్ అన్నారు. అవినీతి మచ్చ లేదంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి పోలవరంలో అవినీతి మరకగా మారిందని ఆయన అన్నారు. పోలవరంలో 50శాతం పైగా అవినీతి ఉందని విమర్శించారు. నితిన్ గడ్కరీకి పేరులో మాత్రమే నీతి ఉందని, ఆయన చేసేది అంతా అవినీతేనని చింతా మోహన్ అన్నారు.
ప్రధాని మౌనం ఎందుకు...
పోలవరం పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోట్లు దోచుకుంటున్నారని, దీనిపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని చింతా మోహన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Recommended Video
వారు ఏకం కావాలని.
కాపులు, దళితులు ఏకమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించాలని చింతా మోహన్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వారికి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.