పవన్ ఎఫెక్ట్: అప్రమత్తమైన చిరంజీవి, ఫ్యాన్స్తో భేటీ
హైదరాబాద్: తన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి అప్రమత్తమయ్యారు. చిరంజీవి మంగళవారం మధ్యాహ్నం తన అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు చిరు అభిమాన సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ భేటీలో మాజీ మంత్రులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు రఘువీరా రెడ్డి, వట్టి వసంత్ కుమార్లు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి అభిమానులు రాజకీయంగా మెగాస్టార్ వెంటే ఉంటామని ఓ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిని వారు చిరుకు అందచేయనున్నారు.
అదే సమయంలో చిరంజీవి తన అభిమానులను రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు పార్టీకి అండగా ఉండాలని కోరనున్నారు. చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా.. భారతీయ జనతా పార్టీకి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే.
అభ్యర్థుల ఖరారు బాధ్యత వారిదే
కాగా, అంతకముందు ఇందిరాభవన్లో ఎపి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఏ స్థానంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి? అనే బాధ్యతను చిరంజీవి, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు శాసనసభ అభ్యర్థుల ఎంపిక జాబితా వీరే ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీల సూచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.